లక్నో : తాలిబన్లకు మద్దతివ్వడం అంటే దేశ వ్యతిరేకులు, మహిళలు, చిన్నారుల వ్యతిరేకులకు ఊతమిచ్చినట్టేనని యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ అన్నారు. ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ సానుభూతిపరుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలను హెచ్చరించారు. హపూర్ జిల్లాలో బుధవారం పలు ప్రాజెక్టుల శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గొన్న యోగి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని నవ భారత్ దిశగా నడిపిస్తున్నారని ఇదే బాటలో యూపీ సైతం పలు రంగాల్లో ముందుకు సాగుతున్నదని చెప్పుకొచ్చారు. సుపరిపాలన, భద్రత విషయంలో ఆదర్శప్రాయంగా నిలుస్తోందని అన్నారు. దేశ పురోగతిని సహించని శక్తులు మనకు అడ్డుపడేందుకు కుట్ర పన్నుతున్నారని ఇలాంటి వారు తాలిబన్ల మనస్తత్వం కలిగిన వారిగా మనం గుర్తించాలని ఆయన వ్యాఖ్యానించారు. తాలిబన్ల తప్పుడు పనులకు వత్తాసు పలికే వారి పట్ల మనం అప్రమత్తంగా ఉండాలని అన్నారు.