లక్నో : వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటినుంచే ప్రచారాస్త్రాలకు పదునుపెడుతున్నాయి. పాలక బీజేపీతో పాటు ఎస్పీ, బీజేపీ, కాంగ్రెస్లు తమదైన ప్రచారవ్యూహం, పొత్తులు ఎత్తులతో అసెంబ్లీ ఎన్నికల సమరానికి సన్నద్ధమయ్యాయి. ఇక అభివృద్ధి, విశ్వాసం నినాదంతో ఎన్నికల బరిలో దిగాలని యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ నిర్ణయించారు. ఈ నినాదంతో ప్రచారాన్ని హోరెత్తించేందుకు సిద్ధమయ్యారు.
2022లో బీజేపీ అధికారంలోకి వస్తే కరోనా నియంత్రణ, రైతుల సంక్షేమం, ఉపాధి అవకాశాల పెంపు, మాఫియాపై ఉక్కుపాదం వంటి అంశాలకు పెద్దపీట వేస్తామని కాషాయ పార్టీ చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పధకం నవంబర్ వరకూ పొడిగించగా యోగి సర్కార్ జూన్లో ఉచిత రేషన్ పధకాన్ని ప్రకటించింది.
ఇక రానున్న ఎన్నికల్లో తిరిగి పాలనాపగ్గాలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) కూడా ఈ దిశగా కసరత్తు ముమ్మరం చేసింది. యూపీ ఎన్నికల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని తమ పార్టీకి ప్రజలు 350 స్ధానాలు కట్టబెడతారని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైన కాషాయ సర్కార్కు భంగపాటు తప్పదని హెచ్చరించారు.
మరోవైపు మాయావతి సారథ్యంలోని బీఎస్పీ సైతం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు అడుగులు వేస్తుండగా ప్రియాంక నేతృత్వంలో యూపీలో మెరుగైన ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుంది.