సిమ్లా : అక్రమంగా సాగుచేస్తున్న గసగసాల పంటను(పాపీ ప్లాంట్స్)ను పోలీసులు ధ్వంసం చేశారు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్ మండీ జిల్లాలోని చౌహర్ లోయలో చోటుచేసుకుంది. 16.5 ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూమిలో కొందరు వ్యక్తులు అక్రమంగా ఈ గసగసాల పంటను సాగు చేస్తున్నారు. సమాచారం మేరకు పోలీసులు రైడ్ చేసి పంటను ధ్వంసం చేశారు. ఎన్డీపీఎస్ యాక్ట్ 18 కింద నిందితులపై ఇప్పటి వరకు నాలుగు కేసులు నమోదు చేశారు.
డ్రగ్స్ మాఫియా ముఠాలు హెరాయిన్, మార్ఫిన్ తయారీకి మారుమూల గ్రామాల్లో రైతులను ప్రలోభపెట్టి రహస్యంగా ఈ పంటను సాగుచేయిస్తుంటాయి. గసగసాల కాయల నుంచి వచ్చే జిగురును హెరాయిన్ తయారీకి ఉపయోగిస్తారు. అదేవిధంగా ఔషధాల తయారీలో మత్తు కలిగించే మార్ఫిన్ తయారీకి కూడా గసగసాల కాయలను ముడిసరకుగా ఉపయోగిస్తారు. కాయలోని గసాలను వంటలకు వాడుతారు.