న్యూఢిల్లీ : కరోనాపై పోరులో యోగా ఆశా కిరణంగా నిలిచిందని, ప్రజలకు శక్తినిచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. దవాఖానల్లో కరోనా రోగులతో వైద్యులు, నర్సులు యోగా చేయించారని చెప్పారు. ‘యోగిక్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్’తో శ్వాస వ్యవస్థ బలోపేతమవుందని నిపుణులు నొక్కిచెప్పడాన్ని గుర్తు చేశారు. సోమవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) భాగస్వామ్యంతో ‘ఎం-యోగా’ అప్లికేషన్ను తెస్తున్నామని ప్రకటించారు. ఈ యాప్లో యోగా శిక్షణకు సంబంధించిన అనేక వీడియోలు వివిధ భాషల్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా యోగా విస్తరించడానికి, ‘ఒకే ప్రపంచం-ఒకే ఆరోగ్యం’ ప్రయత్నాలకు ఈ యాప్ ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఏడాదిన్నర కాలంలో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది కొత్తగా యోగా సాధన మొదలుపెట్టారని చెప్పారు.
పీపీఈ కిట్లు ధరించి..
తమిళనాడులోని కోయంబత్తూరులో కొందరు కరోనా రోగులు పీపీఈ కిట్లు ధరించి యోగా సాధన చేశారు. లఢక్లో మంచుకొండల్లో తన మ్యాట్ను పరచి ఐటీబీపీ జవాన్ ఒకరు సూర్య నమస్కారాలు చేశారు. అలాగే భారత్, చైనా సరిహద్దుల్లో ఐటీబీపీ జవాన్లు 18000 అడుగుల ఎత్తులో యోగా చేశారు.
టైమ్స్ స్కేర్లో 3 వేల మంది…
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది యోగాసనాలు వేశారు. ప్రపంచవ్యాప్తంగా భారత దౌత్య కార్యాలయాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాయి. అమెరికాలోని న్యూయార్క్లో టైమ్స్ స్కేర్లో 3 వేల మంది యోగా సాధకులు ఆసనాలు వేశారు. వాషింగ్టన్లోని ఇండియన్ హౌస్లో అధికారులు యోగా సెషన్ నిర్వహించారు. చైనా రాజధాని బీజింగ్లో భారత దౌత్య కార్యాలయం ఆధ్వర్యంలో యోగా నిర్వహించారు. కాఠ్మాండులో భారత రాయబార కార్యాలయం ఇంటింటా యోగా పేరిట ఒక కార్యక్రమం నిర్వహించింది.
యోగాకు పుట్టినిల్లు భారత్ కాదు.. నేపాల్ : ఓలీ
యోగాకు పుట్టినిల్లు భారతదేశం కాదని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యోగా నేపాల్లో పుట్టిందన్నారు. ఇండియా ఒక దేశంగా అవతరించడానికంటే ముందే నేపాల్లో యోగా సాధన చేశారని, యోగా కనిపెట్టినప్పుడు ఇండియా లేనేలేదని అన్నారు. అయితే మోదీనే యోగాకు ప్రాచుర్యం కల్పించారని ఓలీ తెలిపారు.