భోపాల్: ప్రధాని నరేంద్ర మోదీ డైరెక్టర్ అయితే, తాను యాక్టర్నని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ‘శివరాజ్ సింగ్ నటుడు, మోడీ దర్శకుడు’ అని కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ బుధవారం చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థించుకున్నారు. ఉప ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా గురువారం ఖాండ్వా సభలో శివరాజ్ సింగ్ మాట్లాడారు. ‘చిన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.6,000 డిపాజిట్ చేయాలని డైరెక్టర్ పీఎం మోడీ నిర్ణయించారు. నేను 4వ సారి సీఎం అయ్యాను. కాబట్టి డైరెక్టర్ మోదీ ఇచ్చే ఆరు వేలకు రూ.4,000లు కలిపి రైతులకు రూ.10,000లు ఇవ్వాలని నటుడు శివరాజ్ సింగ్ చౌహాన్ నిర్ణయించారు’ అని అన్నారు.
నిమర్ ప్రాంతానికి నీటి సరఫరాను ఈ నటుడు తీసుకువచ్చాడని చౌహాన్ తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేసిందని ఆయన ప్రశ్నించారు. కమల్ నాథ్ బుధవారం ఇక్కడే ఉన్నా తాను చేసిన అభివృద్ధి ఆ కాంగ్రెస్ నేతలకు కనిపించడం లేదని శివరాజ్ సింగ్ విమర్శించారు.