ఘజియాబాద్, మే 24: దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నాయన్న వార్తలు ఊరట కలిగిస్తున్న సమయంలో కొత్త ఫంగస్ల దాడి కలవరాన్ని పెంచుతున్నది. ఇప్పటికే కొవిడ్ రోగులు బ్లాక్, వైట్ ఫంగస్ల బారిన పడుతుండగా తాజాగా యెల్లో ఫంగస్ వెలుగుచూసింది. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో తొలిసారిగా ఓ వ్యక్తికి సోమవారం యెల్లో ఫంగస్ నిర్ధారణ అయినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం రోగికి ఘజియాబాద్లోని ఈఎన్టీ దవాఖానలో చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించారు. బ్లాక్, వైట్ ఫంగస్తో పోల్చితే ఈ యెల్లో ఫంగస్ మరింత ప్రమాదకరమైనదిగా తెలుస్తున్నది.
ఇవీ లక్షణాలు..
బద్ధకం, ఆకలి మందగించడం లేదా అసలే లేకపోవడం, బరువు తగ్గడం. తీవ్రమైన కేసుల్లో గాయాలు మానకపోవడం, గాయాలు మరింతగా పెరగడం, గాయాల నుంచి చీము కారడం, కణజాలం దెబ్బతినడంతో కండ్లకు కూడా హాని కలుగడం, అవయవాలు పనిచేయకపోవడం. పోషకాహారలోపం కూడా తలెత్తవచ్చు.
చికిత్స ఏమిటంటే?..
యెల్లో ఫంగస్ ప్రాణాంతకమైన వ్యాధి అని వైద్యులు చెబుతున్నారు. లక్షణాలు గుర్తించిన వెంటనే చికిత్స అందించడం ముఖ్యమని అభిప్రాయపడుతున్నారు. యెల్లో ఫంగస్ చికిత్సకు యాంటీ ఫంగల్ ఔషధం ‘ఆంఫోటెరిసిన్-బి’ని వాడాలని సూచిస్తున్నారు.
వ్యాధి సోకడానికి కారణాలు
అపరిశుభ్రతే యెల్లో ఫంగస్ సోకడానికి ప్రధాన కారణమని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యమని పేర్కొన్నారు. పాచిపోయిన ఆహార పదార్థాలు, మల విసర్జితాలు కూడా ఈ వ్యాధిని వ్యాప్తి చేస్తాయన్నారు. ఇంటిలో తేమ, చెమ్మ ఉంటే అదికూడా బ్యాక్టీరియా, ఫంగస్ను మరింత విస్తరింపజేస్తుందని పేర్కొన్నారు. ఇంట్లో తేమ శాతం 30-40 శాతం మధ్య ఉండేలా చూసుకోవడం మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
బ్లాక్ ఫంగస్ లక్షణాలు
జ్వరం, కండ్ల కింద నొప్పి, ముక్కు దిబ్బడ, కంటి చూపు తగ్గడం, కండ్లు-ముక్కు చుట్టూ ఎర్రగా కావడం, తలనొప్పి, దగ్గు, రక్తపు వాంతులు, మానసిక స్థితిలో సమతుల్యం కోల్పోవడం
వైట్ ఫంగస్ లక్షణాలు
మహిళల్లో అయితే తరుచూ జననాంగం నుంచి తెల్లని శ్లేష్మంలాంటి ద్రవం కారడం (ల్యూకోరోయా అని అంటారు), నవజాత శిశువుల్లో మర్మావయం వద్ద తెల్లని, ఎర్రని మచ్చలు ఏర్పడటం (డయపర్ క్యాండియాసిస్), పిల్లలు, పెద్దల్లో నాలుకపై, నోటిలో ఎర్రని పూత పూయడం.