మేడ్చల్ కలెక్టరేట్, మార్చి 24: అర్హులందరికీ బ్యాంకర్లు సకాలంలో రుణాలు అందించాలని మేడ్చల్ కలెక్టర్ శ్వేతా మహంతి అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో లీడ్ బ్యాంక్ మేనేజర్లు, ఇతర బ్యాంక్ ప్రతినిధులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున వివిధ పథకాల కింద కేటాయించిన యూనిట్లు గ్రౌండింగ్ అయ్యేలా చూడాలన్నారు. సమగ్ర సమాచారం లేకుండా సమావేశానికి హాజరైన బ్యాంకర్లపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు జాన్ శ్యాంసన్, జడ్పీ సీఈఓ దేవసహాయం, లీడ్ బ్యాంక్ మేనేజరు, ఆయా బ్యాంక్ మేనేజర్లు, జిల్లా అధికారులుపాల్గొన్నారు.
అంగన్వాడీ సేవలు అందేలా చూడాలి..
ప్రతిఒక్కరికీ అంగన్వాడీ సేవలు అందేలా చూడాలని కలెక్టర్ శ్వేతా మహంతి అన్నారు. మేడ్చల్ కలెక్టరేట్లో జిల్లా సంక్షేమ అధికారి ఆధ్వర్యంలో సీడీపీఓలతో పోషన్ అభియాన్, పోషన్ పక్వాన్ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలింతలు, గర్భిణులు, కిషోర బాలికలకు అవసరమైన పోషకాహారం అందించాలన్నారు. కార్యక్రమంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారిణి జ్యోతిపద్మ, సీడీపీఓలు పాల్గొన్నారు.