కోల్కతా: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాపై యాస్ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపుతున్నది. యాస్ తుఫాన్ వల్ల నగరం అంతటా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు దిగా తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. గాలుల కారణంగా పలుచోట్ల వృక్షాలు కూలిపోయాయి. కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. దాంతో ఎన్డీఆర్ఎఫ్ బలగాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.
యాస్ తుఫాన్ బీభత్సంతో ఒడిశా, బెంగాల్ తీరాల్లోని పట్టణాలు గజగజ వణుకుతున్నాయి. పశ్చిమ బెంగాల్లోని తూర్పు మిడ్నాపూర్ జిల్లా న్యూ దిఘా వద్ద సముద్రం ఉప్పొంగింది. సునామీని తలపించేలా సముద్రపు నీరు ఊళ్లోని నివాస ప్రాంతాల్లోకి చొచ్చుకెళ్లింది. ఒడిశాలోని భద్రక్ జిల్లాలోనూ సముద్రం ఉప్పొంగి తీరంలోని ఇళ్లను, నివాస సముదాయాలను ముంచెత్తింది.
తుఫాన్ హెచ్చరికల కారణంగా పలు రైళ్లు రద్దయ్యాయి. భారత నావికాదళం సహాయక చర్యలను వేగవంతం చేసింది. నేవీ డైవింగ్ బృందాలు, అవసరమైన సామగ్రి, పడవలతో ప్రత్యేక సిబ్బందితో కూడిన వరద సహాయ బృందాలు రంగంలోకి దిగాయి. కోల్కతాలోని హౌరా బ్రిడ్జి వద్ద నీరు ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. దాంతో ఒడిశా, బెంగాల్ ముఖ్యమంత్రులు ఎప్పటికప్పుడు తమతమ రాష్ట్రాల్లో రెస్క్యూ బృందాలను సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.