చేవెళ్లరూరల్, మార్చి 22 : అన్ని కాలాల్లో నీటిని పొదుపు చేయాలని, నీటిని సంరక్షించే బాధ్యత ప్రతి ఒకరిదని బాలవికాస ప్రతినిధి రెహమాన్ అన్నారు. ప్రపంచ జల దినోత్సవాన్ని పురసరించుకొని శుక్రవారం శంకర్పల్లి మండలం పర్వేద గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలవికాస సాంఘిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రెహమాన్ మాట్లాడుతూ.. తాగునీటి ప్రాముఖ్యత దాని సంరక్షణపై ప్రతి ఒక్కరికీ అవగాహన పెంచడానికి ప్రపంచ నీటి దినోత్సవం జరుపుకొంటారని, ప్రపంచ నీటి సంక్షోభానికి వ్యతిరేకంగా పోరాడేందుకు చర్యలు తీసుకోవడమే ప్రపంచ జల దినోత్సవ ముఖ్య ఉద్దేశమన్నారు.
సుస్థిర అభివృద్ధి లక్ష్యం 2030 నాటికి అందరికీ నీరు, పారిశుధ్యం అనే ఆలోచనకు మద్దతు ఇవ్వడం లక్ష్యాన్ని చేరుకోవడం, సహాయపడటంలో విద్యార్థులు కీలకపాత్ర పోషించాలన్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నీటి కొరతతో ప్రజలు అలమటిస్తున్నారని తెలిపారు. భూమిపై మానవుడు సుభిక్షంగా సురక్షితంగా మనుగడ సాగించాలంటే నీటి పరిరక్షణకు చిన్నప్పటినుంచే బాధ్యత వహించాలని విద్యార్థులకు సూచించారు. అదేవిధంగా నీటి కాలుష్యానికి కారణమయ్యే వాటిని నిషేధించడం, వైవిధ్య రక్షణ వంటి పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విజయ్ కుమార్, రమణారెడ్డి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్లటౌన్ : నీటిని పొదుపుగా వాడుకోవాలని చేవెళ్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కాంచన లత అన్నారు. చేవెళ్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ కాంచనలత, ఎన్ఎస్ఎస్యూ, ఎన్ఐటీఐ ఆధ్వర్యంలో ప్రపంచ జల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశంలో తీవ్ర వర్షభావ పరిస్థితులు రైతంగానికి నష్టాలను మిగిల్చాయని, సకాలంలో వర్షాలు కురవక పంటలకు నీరందక ఎండిపోతున్నాయని తెలిపారు.
బెంగుళూర్ నగరంలో నీరు దొరకక ప్రజల గొంతులు ఎండిపోతున్నాయని, అందుకు ప్రతి ఒక్కరూ నీటిని సంరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ జ్యోతి మాట్లాడుతూ.. నీరు శాంతిని సృష్టించగలదని, విప్లవం కలిగించగలదని తెలిపారు. నీటి సంక్షభంతో వరల్డ్ వాటార్ డే ప్రాముఖ్యత సంతరించుకుందని అన్నారు. కఠినమైన నిబంధనలతో నీటి సంరక్షించుకోవచ్చని వివరించారు. కార్యక్రమంలో అధ్యాపాకులు రుప్నారవింద్రన్, శకుంతల, వెంకటేశ్వర్లు, రాగిణి, వెంకటలక్ష్మి, వీరేశం, విద్యార్థులు పాల్గొన్నారు.
పెద్దఅంబర్పేట : మున్సిపాలిటీ పరిధి కుంట్లూరు సమీపంలోని పల్లవి ఇంజినీరింగ్ కాలేజీలో శుక్రవారం ప్రపంచ జల దినోత్సవాన్ని నిర్వహించారు. నీటిని పొదుపు చేయండి.. ప్రాణాలను కాపాడుకోండి, శాంతి కోసం నీరు’ అంశంపై అవగాహన సదస్సు ఏర్పాటుచేసి, విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఓయూ ప్రొఫెసర్ గోపాల్నాయక్ మాట్లాడుతూ.. సహజ వనరుల్లో నీరు అత్యంత ప్రాధాన్యమైనదని చెప్పారు.
‘సేవ్ వాటర్, సేవ్ లైఫ్’ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. కార్యక్రమంలో పల్లవి విద్యాసంస్థల చైర్మన్ కొమరయ్య, కాలేజీ ప్రిన్సిపాల్ ఎంబీ రాజు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నవీన్కుమార్, కన్వీనర్ ఎం ప్రియంవద, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీధర్, కాలేజీ ప్రతినిధులు సుమేధ రమేశ్, రాజేందర్రెడ్డి, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.