అమరావతి : నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణకు గుంటూరులోని జీజీహెచ్ వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో తనను గుర్తు తెలియని వ్యక్తులు కొట్టారని రఘురామకృష్ణ రాజు సీఐడీ కోర్టుకు తెలిపిన విషయం విధితమే. ఆయన తరఫున న్యాయవాదులు సైతం విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ ఉదయం 10.30 గంటల వరకు పరీక్షలకు సంబంధించిన నివేదిక ఇవ్వాలని జిల్లా కోర్టు, మధ్యాహ్నం 12 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని హైకోర్టు డివిజన్ బెంచ్ శనివారం ఆదేశించింది. ఈ క్రమంలో ఆదివారం ఆయనను పరీక్షల కోసం జీజీహెచ్కు తరలించగా జాప్యం జరుగుతోంది. వైద్య పరీక్షల్లో ఆలస్యంగా ఎంపీ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఎంపీకి రమేశ్ హాస్పిటల్కు తరలించి వైద్య పరీక్షలు చేయించాలని కోర్టు శనివారం ఆదేశించింది.
ప్రస్తుతం ఇక్కడే పరీక్షలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలించేలా రఘురామకృష్ణ వ్యాఖ్యలు చేశారని రెండు రోజుల కిందట సీఐడీ అధికారులు ఆయనను హైదరాదాబాద్లో అరెస్టు చేశారు. దీనిపై హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేయగా.. కోర్టు దిగువ కోర్టును ఆశ్రయించాలని సూచించింది. జిల్లా కోర్టు ఈ నెల 28 వరకు రిమాండ్ విధించింది. దీంతో ఆయన తరఫు న్యాయవాదులు సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. పిటిషన్పై నేడు విచారణ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. చట్టవిరుద్ధంగా తన తండ్రిని ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఎంపీ తనయుడు భరత్ ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంశాఖ సెక్రెటరీ అజయ్ భల్లాకు లేఖ రాసినట్లు తెలిసింది. విచారణ సమయంలో తీవ్రంగా హింసించారని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.