ముందు జాగ్రత్త చర్యలు మరువొద్దు
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకున్న మంత్రి
వరంగల్ చౌరస్తా, ఏప్రిల్ 13 : తెలంగాణలో కరోనా ప్రభావం తక్కువేనని, అయినా ముందు జాగ్రత్త చర్యలు మరువొద్దని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రజలకు సూచించారు. మార్చి 2వ తేదీన ఎంజీఎం వ్యాక్సినేషన్ కేంద్రంలో కరోనా మొదటి డోస్ టీకా తీసుకున్న మంత్రి మంగళవారం తిరిగి అదే కేంద్రంలో రెండో డోస్ టీకా వేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వ్యాక్సిన్పై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, పూర్తి నమ్మకంతో తీసుకోవాలని సూచించారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం 45 సంవత్సరాలు నిండిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తుందని, లబ్ధిదారుల సంఖ్య దృష్ట్యా ఏప్రిల్ నెల మొత్తం ఎలాంటి సెలవులు లేకుండా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు. రాష్ట్రంలో రెండో విడుత టీకాకు అర్హులైన సుమారు 50 లక్షల మందికి వ్యాక్సిన్ ఉచితంగా అందుబాటులో ఉంచడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 136 కేంద్రాలకు పైగా, అర్బన్ జిల్లా కేంద్రంలో 49 కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. టీకా తీసుకున్న తర్వాత సుమారు 30 నిమిషాలకు పైగా మంత్రి వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా, ఎంజీఎం దవాఖాన అభివృద్ధికి ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకారం అందేలా చూస్తానని అన్నారు.