కరోనా సంక్షోభం కారణంగా ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయడం (వర్క్ ఫ్రం హోం – డబ్ల్యూఎఫ్హెచ్) అలవాటు చేసుకుంటున్నారు. అయితే, ఆఫీసుల్లో ఉండి పనిచేయడంతో పోలిస్తే, ఇంటి నుంచి పనిచేసేవారి ఉత్పాదకత తగ్గుతున్నట్టు పలు సర్వేలు చెబుతున్నాయి. దీనికి పలు కారణాలు ఉన్నాయని వివరిస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే, రానున్న రోజుల్లో ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావం ఉండొచ్చని హెచ్చరిస్తున్నాయి. ఆఫీసు నుంచి పనిచేయడంతో పోలిస్తే, ఇంటి నుంచి పనిచేసేటప్పుడు ఉద్యోగుల ఉత్పాదకత తగ్గినట్టు పలు కంపెనీలు కూడా ఒప్పుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం ఓ వినూత్న అలోచన చేసింది. వర్క్ ఫ్రం ఆఫీస్ (డబ్ల్యూఎఫ్వో)లోని సానుకూలాంశాలను తీసుకొని.. వర్క్ ఫ్రం హోం
(డబ్ల్యూఎఫ్హెచ్)లోని ప్రతికూలాంశాలను తీసివేస్తూ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దానికి ‘వర్క్ నియర్ హోం (ఇంటికి సమీపం నుంచి పనిచేయడం-డబ్ల్యూఎన్హెచ్)’ అని పేరుపెట్టింది. గతేడాది అక్టోబర్లో ప్రారంభమైన ఈ విధానం మంచి ఫలితాలు ఇస్తున్నది. -నేషనల్డెస్క్
ఏమిటీ ‘వర్క్ నియర్ హోం’?
కార్యాలయం నుంచిగానీ, ఇంటి నుంచిగానీ కాకుండా మధ్యేమార్గంగా ఇంటికి దగ్గర్లోని ఏదైనా ఓ ప్రదేశం నుంచి పనిచేయడమే ‘వర్క్ నియర్ హోం’ . ఆఫీసులో లభించే అన్ని సదుపాయాలు అంటే, వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్షన్, నిరంతరాయమైన విద్యుత్ సరఫరా, డేటా స్టోరేజీ కోసం క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు, సమావేశ మందిరాలు, వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం, అలసటకు గురైనప్పుడు టీ/కాఫీ వెండింగ్ మెషిను ఇలా అన్నీ ‘వర్క్ నియర్ హోం’ వేదికల్లో ఉంటాయి.
‘వర్క్ నియర్ హోం’తో లాభాలేంటి?
‘వర్క్ ఫ్రమ్ హోం’లో తలెత్తుతున్న దాదాపు అన్ని సమస్యలను ‘వర్క్ నియర్ హోం’ విధానం ద్వారా పరిష్కరించవచ్చు. ఇక్కడ పనిచేసే సమయంలో ఇంట్లో మాదిరి కుటుంబసభ్యులు, పిల్లలు పనికి ఆటంకం కలిగించే అవకాశముండదు. ఉద్యోగులు పనిపై పూర్తి ఏకాగ్రతను కేటాయించవచ్చు. దీంతో పాటు ఈ వేదికలు ఇంటికి దగ్గరగా ఏర్పాటుచేస్తుండటంతో ఉద్యోగులకు ప్రయాణ అలసట ఉండదు. ప్రయాణ సమయం ఆదా అవుతుంది. బస్సులు, రైళ్లలో ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేకపోవడంతో కరోనా సోకుతుందన్న భయం కూడా ఉండదు. పవర్, ఇంటర్నెట్ సమస్యల ప్రస్తావన ఉండదు. ఆఫీసులో నిర్వహణ ఖర్చుతో పోలిస్తే, వీటి ఖర్చు తక్కువ.
ఎక్కడ ఏర్పాటు చేస్తారు? ఖర్చు ఎవరిది?
లాక్డౌన్ కారణంగా పలు హోటళ్లు, ఇంజినీరింగ్ కాలేజీలు, టూరిజమ్ రిసార్టులు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్లు, కమర్షియల్ బిల్డింగులను మూసే ఉంచుతున్నారు. ఉద్యోగులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు సమీపంలోని బిల్డింగులను ‘వర్క్ నియర్ హోం’ వేదికలుగా ఎంపిక చేస్తారు. ఉద్యోగులకు అవసరమైన సదుపాయాల్ని ప్రభుత్వ ఐటీ శాఖ, బిల్డింగ్ యజమానులు సంయుక్తంగా కల్పిస్తారు. ఆ ఖర్చును కంపెనీలు బిల్డింగ్ యజమానులకు చెల్లించాలి. ‘వర్క్ నియర్ హోం’ వేదికలో వివిధ సంస్థల ఉద్యోగులు భౌతిక దూరం వంటి నిబంధనలు పాటిస్తూ పనిచేసుకోవచ్చు. కేరళలో ఇప్పటికే 100కు పైగా ‘వర్క్ నియర్ హోం’ వేదికలు విజయవంతంగా నడుస్తున్నాయి.
‘వర్క్ ఫ్రం హోం’తో ప్రధాన సమస్యలు
విద్యుత్తు సరఫరాలో అంతరాయాలు, ఇంటర్నెట్ సమస్యలు
పని చేస్తున్నప్పుడు కుటుంబసభ్యులు, పిల్లలు అంతరాయం కలిగించడం
ల్యాప్టాప్, కంప్యూటర్లలో తరుచూ సాంకేతిక సమస్యలు తలెత్తడం
ఆఫీసులో పని వాతావరణానికి దీటుగా ఇంట్లో సదుపాయాలు లేకపోవడం
ముఖ్యంగా మహిళా ఉద్యోగులు.. కుటుంబం, ఆఫీసు బాధ్యతల్లో సమతుల్యత పాటించలేక మానసిక సంఘర్షణకు గురవుతున్నారు.