న్యూఢిల్లీ, ఆగస్టు 4: ధనవంతులకు న్యాయసహాయం అందించేందుకు మాత్రమే తాము ఉన్నామన్న భావనను న్యాయ సేవా సంస్థలు వెంటనే విడనాడాలని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ‘ప్రజల ప్రయోజనార్థం’ కూడా పనిచేయాలని పిలుపునిచ్చారు. కోర్టులకు వెళ్లడానికి ఆర్థిక పరిస్థితులు సహకరించనివారి కేసులను కూడా తీసుకోవాలని, వారికి సహాయం చేయాలని కోరారు. భారత న్యాయ సేవా సంస్థలు నిర్వహించిన ఓ కార్యక్రమంలో వర్చువల్ మాధ్యమం ద్వారా ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నో సామాజిక సమస్యలపై, అవసరం ఉన్నవారికి న్యాయ సాయం అందించడం కోసం అంతర్జాతీయ స్థాయి న్యాయసేవా సంస్థలు క్రియాశీలంగా పనిచేస్తున్నాయని చెప్పారు. భారతదేశంలోని సంస్థలు కూడా ఈ దిశగా అడుగేయాలని పిలుపునిచ్చారు. ‘న్యాయశాస్త్ర పట్టా పొందడం సులభమే. కానీ దానినే ఆదాయ వనరుగా మార్చుకొని జీవితం గడపడం చాలా సవాళ్లతో కూడుకొన్నది. న్యాయవాదులకు అవకాశాల్లో అసమానతలు తొలగిపోలేదు’ అని ఈ సందర్భంగా అన్నారు.
మాట పనిచేసింది.. బంధం నిలబడింది!
తెలుగులో నచ్చజెప్పి ఏపీకి చెందిన ఇద్దరు భార్యాభర్తలను కలిపిన సీజేఐ జస్టిస్ రమణ, ఆయన నేతృత్వంలోని ధర్మాసనం మరో సంసారాన్ని నిలబెట్టింది. వైవాహిక జీవితంలో వివాదాలు, భార్య కేసుతో జైలుకు వెళ్లిన బీహార్లోని పాట్నాకు చెందిన ఓ వ్యక్తి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకొన్నాడు. ఈ పిటిషన్ జస్టిస్ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది.‘మీరు మళ్లీ వైవాహిక జీవితంలోకి వెళ్లాలనుకొంటున్నారా’ అని ధర్మాసనం మహిళను ప్రశ్నించింది. దీనికి ఆమె ‘అవును. కానీ చిత్రహింసలు పెట్టనని హామీ ఇస్తేనే వెళ్తాను’ అని జవాబిచ్చారు. తర్వాత జడ్జిలు భర్తను ప్రశ్నించారు. తేడా వస్తే మళ్లీ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. భార్యను హింసించనని అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించారు.