చంద్రునికో నూలుపోగు
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మనకు దూరమై నెలలు గడుస్తున్నా ఆయన లేరన్న చేదు నిజాన్ని మనసు ఒప్పుకోవడం లేదు. ఇంకా ఆయన పాటలు వినిపిస్తున్నాయి. ఆయన మాటలు వినిపిస్తున్నాయి. ఆయన నటించిన సినిమాలు కనిపిస్తున్నాయి. ఇంతలా మనతో మమేకమైన బాలు లేడంటే ఎలా నమ్మగలం! తన గళవిన్యాసంతో భారతీయుల హృదయాల్లో స్థిర నివాసం ఏర్పర్చుకున్నారాయన. ముఖ్యంగా తెలుగువారి గుండెల్లో శాశ్వతంగా కొలువుదీరారు. అలాంటి బాలు గురించి ఎవరైనా ఒక మాట చెబితే చెవులు రిక్కించి వింటాం. ఆయన మాట్లాడిన వీడియో కంటపడితే చూడకుండా వదిలిపెట్టం. ఇప్పుడు ఎస్పీబీ జీవిత విశేషాలు ‘మన బాలూ కథ’గా మన ముందుకు వచ్చింది. ఆయన ఉన్నప్పుడు ప్రచురితమైన ‘బహుముఖ ప్రజ్ఞాశాలి బాలు’ ఆధారంగా ఈ పుస్తకాన్ని తీర్చిదిద్దారు రచయిత భాస్కరుని సత్య జగదీష్. మన బాలు కథలోని అనేక కోణాలను ఇందులో పొందుపరిచారు. బాలు పాటలు, మాటలతో ఆయన జీవితంలోని ఎన్నో విశేషాలను ఇందులో ఆవిష్కరించారు. బాలుపై ప్రముఖుల అభిప్రాయాలనూ సేకరించి అందించారు. బాలూకు నివాళిగా ప్రచురించిన ‘మన బాలూ కథ’ ఆయనను అభిమానించే వారందరికీ బాలూ పాటంత గొప్ప అనుభూతినిస్తుంది.
మన బాలూ కథ
రచయిత: భాస్కరుని సత్య జగదీష్
పేజీలు: 280 వెల: రూ.350
ప్రతులకు: రచయిత 87121 53417
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
నవ్వుల జలజం
రొటీన్ లైఫ్లో కొట్టుమిట్టాడుతున్నారా? కుళ్లు జోకులకు బలవంతంగా నవ్వుతూ లోలోపల బాధపడుతున్నారా? ఎవర్ననుకొని ఏం లాభం. జీవిత చట్రంలో ఇరుక్కున్న అందరి పరిస్థితీ దాదాపుగా ఇలాగే ఉంటున్నది. సుప్తచేతనావస్థలో ఉన్న బతుకుల్లో నవ్వులు విరియాలని కోరుకుంటున్నారా! వెంటనే జలజాక్షిని చదవండి. జలజాక్షి పతిదేవుడ్ని అర్థం చేసుకోండి. అప్పుడు సిసలైన నవ్వులు విరబూస్తాయి. ఇంతకీ ఎవరీ జలజాక్షి అంటారా! మామూలు వనిత కాదావిడ. జగడాల జలజాక్షి. ఆగడాల జలజాక్షి. రచయిత్రి గిరిజారాణి కలవల కలం నుంచి పుట్టుకొచ్చిన గడుసరి ఇంతి. ఆ ఇల్లాలి ఆగడాలే ‘జగడాల జలజాక్షి’ కథా సంకలనం. జలజాక్షి పాత్రను ఎంతో సహజంగా తీర్చిదిద్దారు రచయిత్రి. అందరి ఇండ్లలో ఎదురయ్యే సంఘటనలనే కొత్తగా ఆవిష్కరించారు. సరళమైన భాషలో, అందమైన వాక్యాలతో కథలను పరుగులు పెట్టించారు. వాటిని చదువుతున్నంత సేపు ఆ దృశ్యాలు కండ్లముందు కదులుతున్నట్టుగా అనిపిస్తాయి. వేలు విడిచిన చుట్టాల్లోనో, వీధి చివరనున్న వాటాలోనో జలజాక్షి పాత్ర తారసపడకపోదు. ఈ జలజాక్షిలో వారిని ఊహించేసుకుంటూ కథలు చదివితే మోము మీద ముసిముసి నవ్వులు నర్తిస్తూనే ఉంటాయి. చిరాకులన్నీ మాయమైపోతాయి.
జగడాల జలజాక్షి
(ఆగడాలకు అంతే లేదు)
రచయిత్రి: గిరిజారాణి కలవల
పేజీలు: 164 వెల: రూ.150
ప్రతులకు: నవోదయ బుక్హౌస్,హైదరాబాద్
books.acchamgatelugu.com
మనో శోధన
మాటలకందని భావాలను మనోహరంగా చెప్పాలంటే కవితలకు మించిన సాధనం లేదు. ఓ కవితలో నిదురించే కల గురించి చెబితే, మరో కవితలో నిద్ర లేపే కళ గురించి వివరించొచ్చు. ఇంకో కవితలో కంటిపాప కన్నీరు గురించి చెబితే, వేరే కవితలో కన్నుల్లో నిలిచిపోయిన రూపాన్ని వర్ణించవచ్చు. మనసులో పుట్టిన భావానికి, మెదడులో తట్టిన పదాలను కూర్చి అందమైన కవితగా ఆవిష్కరించవచ్చు. అవన్నీ కవి భావనలే కావచ్చు. మనసుతో చదవగలిగితే ప్రతి కవితా అద్భుతమైన కావ్యంగా అనిపిస్తుంది. పదం పదంలో కొత్తదనం కనిపిస్తుంది. పాదం పాదంలో సరికొత్త కోణం ఆవిష్కృతం అవుతుంది. ఏదో ఒక కవిత మన హృదయాంతరాలల్లో ఏనాడో గూడుకట్టుకున్న పాత జ్ఞాపకాన్ని తట్టి లేపుతుంది. లేదాళ్ళ రాజేశ్వరరావు ‘కందిలి’ కవితా సంపుటి కూడా ఇలాంటి అనుభవాన్ని కలిగిస్తుంది. ‘అద్దం ముందు!’ కవితలో అసలు రూపాన్ని చూపించిన తీరు అందంగా అనిపిస్తుంది. రెప్పలు వాల్చలేని దేవుళ్ల కంటే మనుషులే అదృష్టవంతులని చెప్పే ‘రెప్పలు’ కవిత రెప్పల వెనుకున్న మర్మాన్ని తెలియజేస్తుంది. ఇలా ఎన్నో కవితలు కొత్త ఆలోచనలను రేకెత్తిస్తాయి.
కందిలి
(మరికొన్ని కవితలు)
రచయిత: లేదాళ్ళ రాజేశ్వరరావు
పేజీలు: 184 వెల: రూ.100
ప్రతులకు: పాలపిట్ట బుక్స్- (040) 27678430
నవచేతన, నవోదయ,నవతెలంగాణ,ప్రజాశక్తి పుస్తక కేంద్రాలు