న్యూఢిల్లీ/బెంగళూరు, మార్చి 8: ఇళ్లు, ఉద్యోగం, రాజకీయం.. ఇలా పని ఏదైనా తమకు సాటి లేదని నిరూపిస్తున్నారు మహిళామణులు. సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్రం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు చిరు కానుకలను ప్రకటించాయి. వివిధ రంగాలకు స్త్రీ మూర్తులు చేస్తున్న నిరుపమాన సేవలను రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు ఈ సందర్భంగా కొనియాడారు. మరోవైపు, నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతన్నలు చేపట్టిన నిరసనోద్యమంలో మహిళా రైతుల ప్రసంగాలు ఆకర్షణగా నిలిచాయి.ఆపద సమయాల్లో మహిళలకు తక్షణ సాయాన్ని అందించడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. దేశంలోని అన్ని పోలీసు స్టేషన్లలో మహిళా సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి రూ.200 కోట్లను విడుదల చేస్తునట్టు పేర్కొంది. లైంగిక వేధింపుల కేసుల్లో దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేయడానికి హోంమంత్రిత్వ శాఖలో ప్రత్యేక మహిళ రక్షణ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించింది.
మహిళా దినోత్సవం సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం మహిళలకు ప్రత్యేక కానుకను అం దించింది. ఉద్యోగాలు చేస్తున్న గర్భిణీలకు ఇప్పటివరకు అందిస్తున్న ప్రసూతి సెలవులతోపాటు.. ప్రసవానంతరం మరో ఆరు నెలలపా టు శిశు సంరక్షణ సెలవులను కూడా అందించనున్నట్టు వెల్లడించింది.
మహిళా దినోత్సవం సందర్భంగా అతివలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు శుభాకాంక్షలు తెలియజేశారు. వివిధ రంగాలకు మహిళలు చేస్తున్న సేవలు దేశానికి గర్వకారణమన్నారు.
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ మహిళలు తయారుచేసిన కొన్ని వస్తువులను కొనుగోలు చేశారు. తోడా, నాగా జాతి గిరిజన మహిళలు తయారు చేసిన శాలువాలు, ఖాదీ వస్త్రంపై వేసిన మధుబనీ పెయింటింగ్, ముఖానికి చుట్టుకునే గమ్చాను కొనుగోలు చేశారు.
నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతన్నలు చేపడుతున్న నిరసనోద్యమం ఉద్ధృతంగా కొనసాగుతున్నది. సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వేలాది మంది మహిళలు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. మహిళా రైతు నేతల నిరసన కార్యక్రమాలు, ప్రసంగాలతో సింఘు, టిక్రీ, ఘాజీపూర్ సరిహద్దులు దద్దరిల్లాయి. దేశ వ్యవసాయ రంగానికి మహిళలు అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా మహిళా నేతలు గుర్తుచేశారు. రైతు ఉద్యమంలో మహిళలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారన్నారు.