అధికారులతో సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు
సంగారెడ్డి కలెక్టరేట్, మార్చి 23: జాతీయ రహదారి 161 పనులను వేగవంతం చేసి, త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో నేషనల్ హైవే అథారిటీ అధికారులు, రెవె న్యూ, ఆర్అండ్బీ అధికారులు, సంబంధిత ఏజెన్సీలతో జాతీయ రహదారి-161 పనుల పురోగతి, రిలీజియస్ కట్టడాల సమస్యల పరిష్కారం, కోర్టు కేసులు, పరిహారం చెల్లింపులు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా నేషనల్ హైవే అథారిటీ పీడీ 90 శాతం పనులు పూర్తయ్యాయని, 10 శాతం పనులు మాత్రమే పూర్తి చేయాల్సి ఉన్నదని పేర్కొన్నారు. రిలీజియస్ కట్టడాల తొలగింపు సమస్యలను తహసీల్దార్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, నేషనల్ హైవే అథారిటీ అధికారులు సమన్వయంతో పరిష్కరించాలని సూచించారు. కోర్టు కేసులు త్వరితగతిన పరిష్కరించి పనుల్లో జాప్యం లేకుండా చూడాలన్నారు. అన్ని సమస్యలను పరిష్కరించి పనులను వేగవంతం చేయాలని, ఏప్రిల్ 5లోగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో నేషనల్ హైవే అథారిటీ పీడీ మధుసూదన్రావు, అందోల్ ఆర్డీవో విక్టర్, రెవెన్యూ, ఆర్అండ్బీ అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
కిచెన్ సెట్లు పంపిణీ చేసిన కలెక్టర్
ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రీసెంట్ సొసైటీ సహకారంతో మంగళవారం 50 మంది నిరుపేద కుటుంబాలకు కిచెన్ సెట్లను కలెక్టర్ హనుమంతరావు అందజేశారు. కొవిడ్-19లో భాగంగా ఫ్రంట్లైన్ వారియర్స్గా పని చేసిన 20 మంది సభ్యులకు సర్టిఫికెట్లు, మాస్కులు, సబ్బులను కలెక్టర్ అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అన్ని వేళల ముందుండి సేవలను అందిస్తున్నదని గుర్తు చేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి వనజారెడ్డిని కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు చందర్, ప్రసాద్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.