న్యూఢిల్లీ: ఒక దేశంగా ‘మహిళల అభివృద్ధి’ నుంచి ‘మహిళల సారథ్యంలో అభివృద్ధి’ సాధించే దశకు పురోగతి సాధించడమే తమ లక్ష్యమని రాష్ట్రపతి కోవింద్ అన్నారు. న్యాయ సేవా సంస్థల్లో మహిళల సంఖ్య పెరుగవలసి ఉందని చెప్పారు. జాతీయ న్యాయ సేవా సంస్థ (నల్సా) ఆధ్వర్యంలో 6 వారాల పాటు నిర్వహించే దేశవ్యాప్త న్యాయ అవగాహన కార్యక్రమాలను శనివారం విజ్ఞాన్ భవన్లో రాష్ట్రపతి ప్రారంభించారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బలహీన వర్గాలవారికి సహాయం అందించేందుకు నల్సా ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాష్ట్రపతి సూచించారు. మహాత్మాగాంధీ పేదలకు ఉచిత న్యాయ సేవలు అందించారని.. సీనియర్ న్యాయవాదులు కూడా కొంత సమయాన్ని బలహీన వర్గాలవారికి కేటాయించాలని సూచించారు.
ప్రభుత్వ సహకారం కావాలి: సీజేఐ
హైకోర్టుల్లో జడ్జిలుగా నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన పేర్లను కేంద్రం త్వరగా ఆమోదించాలని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ కోరారు. న్యాయం పొందేందుకు అందరికీ సమాన అవకాశాల కల్పనకు, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వ సహకారం, మద్దతు కావాలని కోరారు. దేశవ్యాప్త న్యాయ అవగాహన కార్యక్రమాల ప్రారంభ సమావేశంలో సీజేఐ మాట్లాడారు. జస్టిస్ రమణ ఏప్రిల్ 24న సీజేఐగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి జడ్జిలుగా నియామకానికి పలువురి పేర్లను చురుగ్గా సిఫారసు చేస్తున్నారు. మే నుంచి ఇప్పటి వరకు హైకోర్టు జడ్జిలుగా నియమించేందుకు 106 మంది పేర్లను కొలీజియం సిఫారసు చేసిందని సీజేఐ గుర్తుచేశారు. వాటిని ఆమోదించడం ద్వారా పెండింగ్ కేసులు కొంతవరకు పరిష్కారమవుతాయని చెప్పారు. 106 పేర్లలో ఏడింటిని ప్రభుత్వం ఆమోదించిందని, మిగతావాటిపై నిర్ణయం ఒకటి రెండు రోజుల్లో తీసుకుంటామని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు తనకు తెలిపారని చెప్పారు. హైకోర్టుల చీఫ్ జస్టిస్లుగా 9 మంది పేర్లను సిఫారసు చేయగా ఒకదానికి ఆమోదం లభించిందన్నారు. కోర్టుల్లో భారీగా పోస్టులు ఖాళీగా ఉండటంతో పాటు కోర్టులు పనిచేయకపోవడం, గ్రామీణ ప్రాంతాల్లో వర్చువల్ కాన్ఫరెన్స్ సదుపాయాలు లేకపోవడం వంటి సమస్యలను కరోనా మహమ్మారి బయటపెట్టిందని చెప్పారు. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి సచేతనమైన న్యాయవ్యవస్థ చాలా ముఖ్యమన్నారు. కక్షిదారులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు తాను, సహ న్యాయమూర్తులు కృషి చేస్తున్నామని చెప్పారు. న్యాయం పొందేందుకు అందరికీ సమాన అవకాశం కల్పించాలంటే ప్రజల్లో న్యాయపరమైన అవగాహన పెంపొందించడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు.