న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ)లో మహిళల ప్రవేశాన్ని మరో ఏడాది పాటు వాయిదా వేయలేమని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. మహిళా అభ్యర్థులు ఈ ఏడాది నవంబర్లోనే ఎన్డీఏ ప్రవేశ పరీక్ష రాయవచ్చని, వచ్చే ఏడాది మే వరకు వేచిచూడాల్సిన అవసరం లేదని ప్రకటించింది. ఈ పరీక్షకు వచ్చే ఏడాది నుంచి మహిళలను అనుమతిస్తామని, అందుకు అంగీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. మహిళల హక్కును నిరాకరించలేమని, వారి అవకాశాన్ని మరో ఏడాది వాయిదా వేయలేమని తేల్చిచెప్పింది. ‘పరీక్ష ఇప్పుడు కాదు తర్వాత నిర్వహిస్తామ’నే ధోరణి యువతుల ఆకాంక్షలను నెరవేర్చదని వ్యాఖ్యానించింది. చాలా తక్కువ సమయం ఉన్నదన్న కేంద్రం వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చుతూ ‘సాయుధ దళాలు చాలా క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నాయి. అలాంటివాటిని అధిగమించడంలో అవి సుశిక్షితమైనవి. ఇప్పుడు కూడా సమర్థంగా బాధ్యతలను నిర్వర్తించగలవ’ని పేర్కొంది.
అప్పటివరకు ఆగాలా?
ఇప్పటివరకు ఎన్డీఏలో ప్రవేశానికి మహిళలకు అనుమతి లేదు. ఇది రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు సాయుధ దళాల్లో మహిళలకు సమాన అవకాశం కల్పించకపోవడం లింగ వివక్షేనని స్పష్టంచేసింది. ఈ విషయంలో కేంద్రానిది ‘మైండ్సెట్ సమస్య’ అన్నది. దీంతో తొలి మహిళా బ్యాచ్ను వచ్చే ఏడాది మేలో పరీక్షకు అనుమతిస్తామంటూ కేంద్రం కోర్టుకు తెలిపింది. వచ్చే ఏడాది మేలో నిర్వహించే పరీక్ష వరకు నిరీక్షిస్తే 2023 జనవరిలో కానీ వారు ఎన్డీఏలోకి అడుగుపెట్టలేరని చెబుతూ వాయిదాకు కోర్టు నిరాకరించింది.