చెన్నై : కరోనా మహమ్మారితో ఆక్సిజన్ అందక కండ్లెదుటే కన్నతల్లి మరణించినా ఆ బాధను దిగమింగుకుని మరీ కొవిడ్-19 రోగుల కోసం ఓ మహిళ ఆక్సిజన్ ఆటోను నడుపుతోంది. కొవిడ్ బారినపడి సకాలంలో ఆక్సిజన్ అందకపోవడంతో చెన్నైకి చెందిన సీతాదేవి తన తల్లిని కోల్పోయింది. ఏప్రిల్ 30న 65 ఏండ్ల విజయను ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో నగరంలోని ఆర్జీజీజీహెచ్ దవాఖానకు తరలించారు. ఆమె వెంట కుమార్తె సీతాదేవి ఉన్నారు. తన తల్లికి అడ్మిషన్ దొరుకుతుందనే ఆశతో సీతాదేవి గంటల తరబడి వేచిచూశారు. 12 గంటలు ఎదురుచూసినా సీతాదేవికి ఆక్సిజన్ బెడ్ లభించలేదు.
మే 1న ఆమెను కుటుంబ సభ్యులు మరో ప్రభుత్వ దవాఖాన స్టాన్లీ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ ఆమెకు బెడ్ లభించినా ఐదు రోజుల పాటు మహమ్మారితో పోరాడి ప్రాణాలు విడిచారు. సమయానికి ఆక్సిజన్ లభించకే తన తల్లి మరణించిందని తెలుసుకున్నసీతాదేవి కొవిడ్-19 రోగులకు సాయం అందించాలని నిర్ణయించుకున్నారు. తల్లి సంస్మరణ కోసం స్ట్రీట్ విజన్ ఛారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించి దాని ద్వారా ఓ ఆటో రిక్షాను కొనుగోలు చేశారు. ఆటోకు ఆక్సిజన్ సిలిండర్ ను ఏర్పాటు చేసి దానికి ఫ్లో మీటర్ ను బిగించి ఆక్సిజన్ అవసరమైన వారికి సాయం చేస్తున్నారు. సీతాదేవి ఔదార్యాన్ని పలువరు ప్రశంసిస్తున్నారు.