అడుగు జాడలు
‘రోజూ ఉదయించే సూర్యుడే అయినా ఏదో కొత్తదనం. రోజూ నడిచే దారి అయినా ఏదో ఉత్సాహం..’ అరుదైన సందర్భాల్లో మాత్రమే ఇలాంటి అనుభూతి కలుగుతుంది. కథలు చదివేటప్పుడు పాఠకుడికి కూడా ఇలాంటి భావన కలిగిందంటే వాటిలో ఏదో మహత్తు ఉన్నట్టు భావించాలి. ‘అడుగులు’ కథలు ఇలాంటి అనుభూతినే కలిగిస్తాయి. కథావస్తువు ఎంపికలో వైవిధ్యం, కథనంలో సరళత వీటిని ప్రత్యేకంగా నిలిపాయి. వివిధ కథల్లో రచయిత్రి ఎంచుకున్న సందర్భాలు, అందులోని ప్రదేశాలు పాఠకులకు మరింత కనెక్ట్ అవుతాయి. తెలంగాణ మలిదశ ఉద్యమ గాఢతను తెలిపే ‘గురి తప్పొద్దు’, దళితుల జీవిత రాతను మార్చే ‘సంకల్పం’ కథ ఆకట్టుకుంటాయి. ‘కొత్తపల్లి’ కథ యువతకు స్ఫూర్తినిస్తుంది. ‘నారుమడి’ యువరైతు ఆదర్శాలను తెలియజేస్తుంది. ఇలా 11 కథలు పదకొండు విభిన్న కోణాలను, జీవితాలను స్పృశిస్తూ సందేశాన్నిస్తాయి. పేదవారి హృదయాలు, మధ్యతరగతి స్వభావాలు, పల్లె పరిమళాలు, పట్నం పోకడలు ఇలా ఎన్నెన్నో సందర్భాలు, సన్నివేశాలు జీవితంలో ఎక్కడో తారస పడినట్టుగా అనిపిస్తుంది. రచయిత్రి దేవేంద్ర వివిధ సందర్భాల్లో రాసిన ఈ కథలు ఆమెలోని రచనాశక్తికి మె(మ)చ్చుతునకల్లా కనిపిస్తాయి. వాటన్నిటినీ ‘అడుగులు’గా సంకలనం చేసిన తీరు బాగుంది.
అడుగులు (కథల సంపుటి)
రచన: డా॥ఎం.దేవేంద్ర
పేజీలు: 110, వెల: రూ.120
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు
మంచు ముత్యాలు
తెలుగును ఆలింగనం చేసుకున్న ఉర్దూకు వహ్వాలు, షుక్రియాలు చెబుతుంటారు. ఉర్దూ పరిమళం తెలుగు గంధానికి తావి అద్దింది. ఉర్దూ పదసంపద మాత్రమే కాదు, సాహితీ ప్రక్రియలు సైతం తెలుగులోకి వచ్చి ఉభయభాషల్లోనూ ప్రత్యేకంగా నిలిచాయి. గడ్డి పరకలపై మంచుముత్యాలను పొదిగే హేమంతంలో ఆసాంతం ప్రకృతి కాంత పరవశిస్తూనే ఉంటుంది. సాహితీ ప్రక్రియల్లో గజల్స్ సౌందర్యం కూడా అలాంటిదే. ఉర్దూనుంచి తెలుగులోకి తొంగి చూసిన గజల్స్ ఝరి మరింత సోయగాలను సంతరించుకున్నది. ‘నను చేరెను గాలి కబురు… తీరానే ఉన్నావని, మది సందడి చేసిందే.. భారాన్నే తీర్చావని!’ ఈ భావాత్మక పంక్తులు ‘హేమంత తుషారాల్లో’ తెలిమంచు తెరల్లా అనిపిస్తాయి. ‘అమ్మంటే అనురాగం.. విరజాజుల పరిమళమే, అమ్మంటే అనుబంధం.. లేతీగల సున్నితమే..!’ అమ్మ గొప్పదనాన్ని చాటే ఈ వాక్యాలను ఆర్ద్రంగా పలికితే అమ్మదనంలోని కమ్మదనం అనుభూతిలోకి వస్తుంది. అంత్యప్రాసలు, మరెన్నో నియమాలకు లోబడి రూపు దిద్దుకునే గజల్స్ లోతైన భావాలను పలికిస్తాయి. అలాంటి గజల్స్ను అద్భుతంగా ఆవిష్కరించారు రచయిత్రి గడ్డం శ్యామల. భావుకతకు పెద్దపీట వేస్తూ ఆమె రచించిన ‘హేమంత తుషారాలు’ 81 గజల్స్ సమాహారం.
హేమంత తుషారాలు (గజళ్ళు)
రచన: డా॥ గడ్డం శ్యామల
పేజీలు: 136, వెల: రూ.150
ప్రతులకు: నవోదయ బుక్హౌజ్, కాచిగూడ
books.acchamgatelugu.com