శ్రీశైలం : శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శుక్రవారం తొమ్మిదో రోజు ఆలయ అర్చకులు శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం రథాంగ పూజ, హోమం, బలి కార్యక్రమాలు నిర్వహణ అనంతరం స్వామివారి రథోత్సవం వైభవంగా సాగింది. మేళతాళాల నడుమ స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను 11 రకాల ప్రత్యేక పుష్పాలతో అలంకరించిన రథంపై అధిష్ఠింజేసి జనసందోహం నడుమ శ్రీశైల పురవీధుల్లో ఊరేగించారు. రథోత్సవంలో భారీగా భక్తులు పాల్గొన్నారు. శివనామస్మరణతో శ్రీశైల క్షేత్ర వీధులు మారుమోగాయి.
ఉత్సవాల్లో భాగంగా స్వామిఅమ్మవార్లకు తెప్పోత్సవం జరిపించారు. విద్యుద్దీప కాంతుల నడుమ పుష్కరిణిలో తెప్పపై ఆదిదంపతులను వీక్షించి భక్తులు తరించారు. అంతకుముందు మంగళ వాయిద్యాలు కళాకారుల నృత్యాల నడుమ ఆలయ రాజగోపురం నుంచి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పుష్కరిణి వద్దకు చేర్చి షోడశోపచార క్రతువులు నిర్వహించి పుష్కరిణిలో మూడుసార్లు ప్రదక్షిణలు చేయించారు. కార్యక్రమంలో ఈఓ కేఎస్ రామారావు, ఈఈ మురళీ బాలకృష్ణ, డీఈ నర్సింహాడ్డి, శ్రీనివాసరెడ్డి, పీఆర్ఓ శ్రీనివాసరావు, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నర్సింహారెడ్డి, అయ్యన్న, రవికుమార్, వెంకటేశ్వరగౌడ్ పాల్గొన్నారు.