ముంబై: మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కొంకన్ తీరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముంబైకి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న రత్నగిరి జిల్లాలోని తీరప్రాంత పట్టణం చిప్లున్ బాగా ప్రభావితమైంది. 70 వేల మందికిపైగా జనాభా ఉన్న ఈ నగరం సగానికిపైగా వరద నీటిలో మునిగిపోయింది. ఐదు వేల మందికిపైగా ప్రజలు వరదల్లో చిక్కుకుపోయారు.
మరోవైపు చిప్లున్ నగరంలో ఒక మహిళను రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది విఫలయత్నం చేశారు. వరద నీటిలో చిక్కుకున్న ఆమెను ఒక భవనం పైకి తెచ్చేందుకు ప్రయత్నించారు. టైర్కు తాడు కట్టి కిందకు వదిలారు. ఆ మహిళ టైర్ను పట్టుకోగా తాడును పైకి లాగారు. అయితే ఆమె భవనం టెర్రస్ వరకు చేరగా రెస్క్యూ సిబ్బందిలో ఒకరు ఆమె చేయి అందుకుని పైకి లాగేందుకు ప్రయత్నించారు. అయితే అతడు పట్టుకోల్పోవడంతో ఆ మహిళ వరద నీటిలో పడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.