నోయిడా : కరోనా బారిన పడ్డ ఓ మహిళకు ప్రభుత్వ ఆస్పత్రిలో బెడ్ దొరక్క ఆమె మృతి చెందింది. ఈ విషాద ఘటన నోయిడాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న జిమ్స్ ఆస్పత్రిలో గురువారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. మధ్యప్రదేశ్కు చెందిన జాగృతి గుప్తా(35) నోయిడాలో ఇంజినీర్గా పని చేస్తోంది. ఆమె భర్త, ఇద్దరు పిల్లలు మధ్యప్రదేశ్లో నివాసముంటున్నారు. అయితే జాగృతికి ఇటీవలే కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ క్రమంలో ఆమె చికిత్స నిమిత్తం గురువారం తన కారులో జిమ్స్ ఆస్పత్రికి చేరుకుంది. ఆరోగ్యం పూర్తిగా విషమిస్తోందని, తనకు బెడ్ కావాలని ఆస్పత్రి సిబ్బందిని కోరింది. కానీ బెడ్లు లేవంటూ వారు సమాధానం దాటవేశారు. సుమారు 3 గంటల పాటు కారులోనే ఉన్న ఆమె చివరకు శ్వాస ఆడక ప్రాణాలు వదిలింది.
ఉత్తరప్రదేశ్లోని ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ కొరత లేదని ఆ రాష్ర్ట సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇటీవలే ప్రకటించారు. కానీ ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందని, బెడ్లు కూడా సరిపడా లేవని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండింటి కొరతను వీలైనంత త్వరగా తీర్చాలని ప్రభుత్వానికి బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.