వైద్యరంగంలో అవసరమైన పరికరాలను భారత్ ఇప్పటివరకు ఇతర దేశాలనుంచి దిగుమతి చేసుకుంటున్నది. వీటి ధరలు అధికంగా ఉండటంతో ఆ భారం పరోక్షంగా వైద్యంకోసం వెళ్లే రోగులపై పడుతున్నది. ఈ నేపథ్యంలో అనేక రకాల టీకాలు, మందులను ఉత్పత్తిచేస్తున్న మన రాష్ట్రంలోనే వైద్య పరికరాలను కూడా తయారుచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారు.
ప్రత్యేక శ్రద్ధతో రాష్ట్రం ఏర్పడిన తరువాత జూన్ 2017లో దేశంలోనే అతిపెద్ద మెడికల్ డివైజెస్ పార్కుకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్లో 276 ఎకరాల్లో దీనిని ఏర్పాటుచేశారు. నాలుగేండ్లలో పలు ప్రఖ్యాత కంపెనీలతో కలిపి 40 వరకు ఇక్కడ ఏర్పాటయ్యాయి. కొన్ని కంపెనీలు ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించగా, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. ఇవన్నీ ఉత్పత్తి ప్రారంభిస్తే మన దేశ అవసరాలకే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా ఎగుమతి చేయవచ్చు.
ఇప్పటికే హైదరాబాద్కు ‘బల్క్ డ్రగ్ క్యాపిటల్’గా పేరున్నది. ఇప్పుడు కొవిడ్ 19 వ్యాపిస్తున్న నేపథ్యంలో- రెమ్డెసివిర్, హైడ్రో క్లోరోక్విన్, ఫేవిపిరవిర్ మొదలైనవి ఇక్కడే భారీ ఎత్తున తయారవుతున్నాయి. కొవిడ్ ఔషధ పరిశోధనలకు ఇప్పుడు ఈ మహానగరమే కేంద్రం. అందుకే రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ మంత్రి కేటీఆర్ గత ఆగస్ట్లో జీనోమ్ వ్యాలీ సందర్శించి అక్కడి వసతులను, ప్రయోగాలను ఆరా తీశారు. వ్యాక్సిన్ రూపకల్పన, తయారీలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. కోట్లాది డోసులు ఉత్పత్తి కానున్నాయి. ఇక్కడి ప్రయోగాలకు అనేక పేటెంట్లు దక్కాయి.
అమెరికా ఎఫ్డీఏ గుర్తింపు గల అతి భారీ వ్యాక్సిన్ తయారీ వసతులు ఉన్నది ఇక్కడే. అంతర్జాతీయ ప్రమాణాలతో కోట్లాది వ్యాక్సిన్ తయారీ సామర్థ్యం ఉన్నది ఇక్కడి సంస్థలకే. హైదరాబాద్లో ఇప్పటికే 800 జీవశాస్త్ర వైద్య సంస్థలున్నాయి. దేశంలోనే అత్యధికంగా ఇరవై ఇంక్యుబేషన్ కేంద్రాలు, 800 స్టార్టప్లు ఉన్నాయి. లక్షకు పైగా ఫార్మా నిపుణులు ఇక్కడ పనిచేస్తున్నారు. ఇక్కడి ఔషధ ఎగుమతుల కోసం హైదరాబాద్ విమానాశ్రయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తూర్పు ఆసియా మొదలుకొని లాటిన్ అమెరికా వరకు ఏ మూలకు పోయినా హైదరాబాద్ వ్యాక్సిన్లు, ఔషధాలు కనిపిస్తాయి.
వైద్య పరికరాలు కూడా హైదరాబాద్లో భారీ ఎత్తున తయారవుతున్నాయి. సుల్తాన్పూర్లోని మెడికల్ డివైజెస్ పార్కులో రక్త నమూనాలు సేకరించే కిట్లు, హాస్పిటల్ బెడ్లు, క్యాథటెర్లు, ఆఫ్తాల్మిక్ పరికరాలు, టెలీ ఈసీజీ, యూరాలజీ, ఐవీఎఫ్, ఐసీయూలో ఉపయోగించే పరికరాలు, పల్స్ ఆక్సీ మీటర్లు, ఎక్స్రే పరికరాలు, అల్ట్రాసౌండ్ స్కానర్లు, నెఫ్రాలజీ, డయాలసిస్ ఇంప్లాంట్స్, మాలిక్యులర్స్, డయాగ్నోస్టిక్స్ కిట్లు, హీట్ ఎక్సేంజర్స్, డిస్ఇన్ఫెక్షన్ పరికరాలు, త్రీడీ ప్రింటెడ్ మెడికల్ ఇంప్లాంట్స్, ప్రైమరీ ప్యాకేజింగ్ కాంపోనెంట్స్, యూరిన్ కలెక్షన్ బ్యాగ్స్, సర్జికల్ అప్లికేటర్స్, ఆర్థో త్రీడీ ప్రింటింగ్, డెంటల్ ఇంప్లాంట్స్, స్టెరైల్ కిట్స్, ఐవీఎఫ్, ప్రత్యేక రకాల కండ్లద్దాలు, హెవీ ఇండస్ట్రియల్ రేడియేటర్స్, కంటెనర్స్ తదితర పరికరాల పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి.
ఆసియాలోనే అతిపెద్ద స్టెంట్ యూనిట్ తయారీ సంస్థ కూడా త్వరలో ఉత్పత్తి ప్రారంభించనున్నది. సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్ (ఎస్ఎంటీ) సంస్థ మొత్తం రూ.250 కోట్ల పెట్టుబడితో ఇక్కడ యూనిట్ను ఏర్పాటుచేసింది. 20 ఎకరాల్లో ఏర్పాటైన ఈ సంస్థలో సుమారు 2,200 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనున్నది. దీని ఉత్పత్తి సామర్థ్యం ఏటా 12 లక్షల స్టెంట్లు. ప్రత్యేక కండ్లద్దాలు కూడా ఇక్కడ ఉత్పత్తి అవుతున్నాయి. కరోనా సమయంలో వైరస్ సోకకుండా ఉపయోగించే సేఫ్టీ గ్లాసెస్ను కూడా ఇక్కడి ప్లాస్టిలాజిస్టిక్స్ సంస్థలో ఉత్పత్తి చేస్తున్నారు. కరోనా రోగులకు చికిత్సచేస్తున్న వైద్యులకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇక్కడి రెండు కంపెనీలు ఫేస్షీల్డ్లను కూడా ఉత్పత్తి చేస్తున్నాయి.
పరిశ్రమల, ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ ఇటీవల బయో ఆసియా సదస్సులో మాట్లాడుతూ, గత ఏడాదిలో జీవశాస్త్రరంగంలో 3, 700 కోట్ల పెట్టుబడులు వచ్చాయనీ, 14 వేల మంది ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయనీ తెలిపారు. కొవిడ్ మహమ్మారి వల్ల ఏర్పడిన ఒత్తిడిని హైదరాబాద్ ఔషధరంగం విజేతగా నిలిచిందని ఆయన గర్వంగా వెల్లడించారు. ఈ రంగాన్ని వంద బిలియన్ డాలర్ల మేర వృద్ధి చేయాలనేది మంత్రి ఆకాంక్ష. క్యాన్సర్ చికిత్స కోసం అంబ్లాలిసిబ్ ఔషధానికి యుఎస్-ఎఫ్డీఏ ఆమోదం పొందబోవడం విశేషమని ఆయన వెల్లడించారు. జీనోమ్ వ్యాలీ 2 మాస్టర్ప్లాన్ సిద్ధమైందని ఆయన వివరించారు. ఇక్కడ వెయ్యి మందికి పైగా ఆవిష్కర్తలు అనేక ఔషధాలను వృద్ధి చేస్తున్నారని తెలిపారు. మంత్రి కేటీఆర్ వ్యూహం ప్రకారం- హైదరాబాద్ నగరంలో ఔషధరంగం పరిపరివిధాల వృద్ధి చెందబోతున్నది. ఇక్కడ డిజిటల్ మెడిసిన్ రంగంపై ఇప్పటికే ముందడుగు పడ్డది. పలు సంస్థలు ఆర్అండ్డితో పాటు డిజిటల్ కార్యకలాపాలు మొదలుపెట్టాయి. లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ ఇక్కడ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నది. డేటా అనలిటిక్స్, క్లినికల్ రీసెర్చి మీద దృష్టి కేంద్రీకరించింది. అమెరికాకు చెందిన ఫార్మాకోపియాతో కలిసి తెలంగాణ ప్రభుత్వం అనలిటికల్ కెమిస్ట్రీ, ఏఐ/ఎంఎల్ రంగంలో నైపుణ్య శిక్షణపై దృష్టి సారించింది. మెడికల్ టూరిజం కూడా బాగా వృద్ధి చెందుతున్నది. కరోనా వ్యాప్తి సందర్భంగాలోనే కాదు, సాధారణ పరిస్థితుల్లోనూ ఫార్మా ఉత్పత్తులలో, వైద్య చికిత్సలో హైదరాబాద్ అగ్రశ్రేణిలో నిలుస్తున్నది.
‘హైదరాబాద్ చుట్టూ వ్యాక్సిన్ ఉత్పత్తిసంస్థలు పుట్టుకొచ్చాయి. విదేశీ ఒప్పందాలతో రంగంలోకి దిగాయి’ అని నవీ ముంబయికి చెందిన భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్ లిమిటెడ్ అధికారి ఒకరు అన్నారు. కోవ్యాక్సిన్తో పాటు ముక్కులో వేసే వ్యాక్సిన్ కోరోఫ్లూ కూడా ఇక్కడే బీబీఐఎల్ ఆధ్వర్యంలో తయారవుతున్నది. విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం, మాడిసన్, ఫ్లుజెన్తో సంయుక్తంగా దీనిని బీబీఐఎల్ తయారు చేస్తున్నది. అమెరికాలోని ఫిలడేల్ఫియాకు చెందిన థామస్ జెఫర్సన్ విశ్వవిద్యాలయంతో కలిసి మరో వ్యాక్సిన్ కూడా రూపొందిస్తున్నది. దీనిని ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాషింగ్టన్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ మెడిసిన్తో సంయుక్తంగా మూడవ వ్యాక్సిన్ తయారు చేయబోతున్నారు. ఇప్పటికే జీనోమ్ వ్యాలీలో కోవ్యాక్సిన్ భారీ ఎత్తున తయారవుతున్నదనేది తెలిసిందే.