భువనేశ్వర్: రైల్వే స్టేషన్లో ఆగిన రైలులో ఒక మహిళ ప్రసవించింది. మగ శిశువునకు జన్మనిచ్చింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ఈ ఘటన జరిగింది. 27 ఏండ్ల ఆయేషా ఖాతున్, యశ్వంత్పూర్ వెళ్లేందుకు ఆదివారం హౌరా-యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించారు. అయితే రైలు కటక్ స్టేషన్ దాటగానే ఆమెకు నొప్పులు మొదలయ్యాయి. దీంతో టికెట్ కలెక్టర్ భువనేశ్వర్ రైల్వే స్టేషన్ డైరెక్టర్కు సమాచారం ఇచ్చారు. ఆ రైలు భువనేశ్వర్ రైల్వే స్టేషన్కు చేరగానే వైద్య, మహిళా సహాయక సిబ్బంది ఆమె ఉన్న కోచ్ వద్దకు వచ్చారు. వారి సహాయంతో ఆయేషా రైలు కోచ్లోనే ప్రసవించింది. పండంటి బాబుకు ఆమె జన్మనిచ్చింది.
తల్లీబిడ్డలకు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం భువనేశ్వర్లోని ఆసుపత్రికి తరలించారు. తల్లీబిడ్డ ఆరోగ్యంతో ఉండటంతో యశ్వంత్పూర్కు వెళ్లేందుకు రైలు టికెట్తోపాటు బిస్కెట్లను భువనేశ్వర్ స్టేషన్ డైరెక్టర్ చిత్తరంజన్ నాయక్ ఆమెకు అందజేశారు. దీంతో ఆయేషా తన బాబుతో కలిసి సోమవారం మరో రైలులో యశ్వంత్పూర్కు ప్రయాణమయ్యారు. తనకు సహకరించిన రైల్వే అధికారులు, సిబ్బందికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.