న్యూఢిల్లీ : ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు సాధారణంగా జూన్ ఒకటో తేదీన కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ శాఖ ఎక్స్టెండెడ్ రేంజ్ ఫోర్ కాస్ట్ (ఈఆర్ఎఫ్) అంచనా వేసింది. జూన్ సెప్టెంబర్ మధ్య దేశంలో వార్షిక వర్షాపాతం 70శాతం నమోదైంది. ‘జూన్ 1న కేరళ మీదుగా రుతుపవనాలు సకాలంలో వస్తాయని ఐఎండీ ఈఆర్ఎఫ్ సూచిస్తుందని, ఇది ప్రారంభ సూచన’ అని ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి మాధవన్ రాజీవన్ గురువారం ట్వీట్ చేశారు. వచ్చే నైరుతి రుతుపవనాల్లో 98శాతం వర్షాపాతం నమోదు కావొచ్చని ఈ నెల ప్రారంభంలో ఐఎండీ పేర్కొంది. రుతుపవనాల సంభావ్యత ‘సాధారణం’ 40 శాతం కాగా, 21 శాతం ‘సాధారణం కంటే’ ఎక్కువగా ఉంటుందని తెలిపింది. 2019, 2020లో సాధారణ వర్షపాతం నమోదుకాగా.. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో ఉంటాయని తెలిపింది. గతంలో 1996,1997,1998 ఏడాదిల్లో వరుసగా మూడేళ్లు సాధారణ వర్షపాతం నమోదైంది.
ఐఎండీ ప్రతి గురువారం ఈఆర్ఎఫ్ను విడుదల చేస్తుంది. ఇందులో రాబోయే నాలుగు వారాల వాతావరణ అంచనాలు ఉంటాయి. ఐఎండీ రెండో దశ రుతుపవనాల లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ (ఎల్ఆర్ఎఫ్)ను ఈ నెల 15న విడుదల చేయనుంది. అప్పటికీ.. అండమాన్ మీదుగా కేరళ తీరానికి రుతుపవనాలు ఎప్పుడు చేరుతాయనే ఖచ్చితమైన అంచనాలు వెలువరించనుంది. గత నెలలో విడుదల చేసిన ఎల్ఆర్ఎఫ్ మొదటి దశలో ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణ వర్షాపాతం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. నాలుగు నెలల సీజన్లో ఎల్నినో సదర్ ఆసిలేషన్ (ఈఎన్ఎస్ఓ) తటస్థ దశ అనుకూలంగా పని చేస్తుందని, దేశవ్యాప్తంగా మంచి వర్షపాతాన్ని తీసుకురాగలదని నిపుణులు పేర్కొన్నారు. కీలకమైన భారతీయ వేసవి రుతుపవనాల సమయంలో వర్షపాతం పనితీరును నిర్ణయించే అనేక ముఖ్య అంశాలలో ఈఎన్ఎస్ఓ ఒకటి.