కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తనది ఏ గోత్రం చెప్పారు. తనది శాండిల్య గోత్రమని ఆమె వెల్లడించారు. నందీగ్రామ్లో గత కొన్ని రోజుల నుంచి ఆమె ప్రచారంలో పాల్గొన్న విషయం తెలిసిందే. నిన్నటితో అక్కడ ప్రచారం ముగిసింది. అయితే అక్కడ నుంచి వెళ్తూ వెళ్తూ .. దీదీ తన గోత్ర రహస్యాన్ని వెల్లడించారు. బ్రహ్మణ వర్గానికి చెందిన శాండిల్య గోత్రం తనదని ఆమె తెలిపారు. గతంలో ఎప్పుడూ తనది ఏ గోత్రం అన్న విషయాన్ని ఆమె చెప్పలేదు. ప్రచార సమయంలో ఓ ఆలయానికి వెళ్తే అక్కడ పూజారి తన గోత్రం అడిగారని, అప్పుడు మా మాతి మనుష్ అని తాను చెప్పినట్లు దీదీ తెలిపారు. నిజానికి 2011లో మమతా బెనర్జీ ఇదే నినాదంతో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు.
గతంలో ఓసారి త్రిపురలోని త్రిపురేశ్వరి ఆలయానికి వెళ్లానని, అప్పుడు అక్కడ తన గోత్రం ఏంటని పూజారి అడిగారని, అప్పుడు కూడా మా మాతి మనుష్ అని చెప్పినట్లు మమతా వెల్లడించారు. కానీ నిజానికి తనది శాండిల్య గోత్రమని ఆమె నందీగ్రామ్లో తెలిపారు.
మమతా బెనర్జీ తన గోత్రం చెప్పడం పట్ల కేంద్ర మత్స్యశాఖ మంత్రి గిరిరాజ్ రియాక్ట్ అయ్యారు. ఓటమి భయంతోనే దీదీ తన గోత్రాన్ని చెప్పినట్లు ఆయన ఆరోపించారు. రోహింగ్యాలు, అక్రమచొరబాటుదారులు కూడా శాండిల్య గోత్రస్తులేనా అని ఆయన అడిగారు. దీదీ ఓటమి ఖాయమని కేంద్ర మంత్రి అన్నారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ తన ట్విట్టర్ అకౌంట్లో శాండిల్య పేరును ప్రిఫిక్స్గా వాడుతారు. ఏప్రిల్ ఒకటో తేదీన జరగనున్న రెండవ దశలో నందీగ్రామ్లో పోలింగ్ జరగనున్నది. అక్కడ బీజేపీ తరపున సువేందు అధికారి పోటీ చేస్తున్నారు. ఇద్దరి మధ్ బిగ్ఫైట్ తప్పదని తెలుస్తోంది.