న్యూఢిల్లీ: డ్రోన్ల వినియోగం ఇక సులువు కానుంది. గురువారం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కొత్త డ్రోన్ రూల్స్( Drone Rules ), 2021ను గెజిట్ నోటిఫికేషన్ ద్వారా జారీ చేసింది. ఇప్పటి వరకూ ఉన్న అన్మ్యాన్డ్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్స్ రూల్స్ 2021 స్థానంలో ఈ కొత్తవి రానున్నాయి. ఈ కొత్త రూల్ ప్రకారం డ్రోన్లకు గుర్తింపు సంఖ్యలు ఉంటాయి. రెక్విజిట్ వివరాలను డిజిటల్ స్కై ప్లాట్ఫామ్లో అందించడం ద్వారా ఈ ప్రత్యేక గుర్తింపు సంఖ్యను పొందవచ్చని ఈ నోటిఫికేషన్ వెల్లడించింది.
గతంలో ఉన్న వివిధ అనుమతుల ప్రక్రియను తొలగించారు. కన్ఫార్మెన్స్ సర్టిఫికెట్, మెయింటెనెన్స్ సర్టిఫికెట్, ఇంపోర్ట్ క్లియరెన్స్, ఆపరేటర్ అనుమతులు, ఆర్&డీ ఆర్గనైజేషన్ ఆథరైజేషన్, స్టూడెంట్ రిమోట్ పైలట్ లైసెన్స్ వంటివాటిని రద్దు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ కొత్త రూల్స్ ప్రకారం.. ప్రభుత్వం డ్రోన్ ఆపరేట్ చేయడానికి ఫీజును కూడా నామమాత్రానికి తగ్గించింది. ఇక డ్రోన్లు తీసుకెళ్లే సామర్థ్యాన్ని కూడా 300 కిలోల నుంచి 500 కిలోలకు పెంచింది.