హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): కరోనా సృష్టించిన విపత్కర పరిస్థితులతో సంక్షోభంలో కూరుకుపోయిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను (ఎంఎస్ఎంఈ) ఉదారంగా ఆదుకోవాలని పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు కేంద్రాన్ని కోరారు. రుణ వాయిదాల చెల్లింపుపై వచ్చే ఏడాది మార్చి వరకు మారటోరియం విధించాలని, అప్పటివరకు వడ్డీని ఎత్తివేయాలని విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు బుధవారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ఆయన లేఖ రాశారు. కరోనా, లాక్డౌన్ వల్ల ఎంఎస్ఎంఈల పరిస్థితి దయనీయంగా తయారైందని లేఖలో పేర్కొన్నా రు. లాక్డౌన్ సమయంలో తెలంగాణ ఎంఎస్ఎంఈలకు పరిమితులు విధించలేదని గుర్తుచేశారు. అయినప్పటికీ ఇతర రాష్ర్టాలనుంచి ముడిసరుకు అందకపోవడం, వలస కూలీలు సొంత ఊళ్లకు వెళ్లిపోవడం, రవాణా ఇబ్బందుల వల్ల తయారైన సరుకు మార్కెట్కు చేరకపోవడం వంటి సమస్యలతో వాటి కార్యకలాపాలు స్తంభించిపోయాయని తెలిపారు. ఇటువంటి సంక్షోభ సమయంలో ఎంఎస్ఎంఈల బ్యాంకు రుణాల చెల్లింపుపై వచ్చే ఏడాది మార్చి 31వరకు మారటోరియం విధించడంతోపాటు అప్పటిదాకా రుణాలపై వడ్డీని ఎత్తివేయడం వంటి చర్యలు తీసుకుంటే ఉపయుక్తంగా ఉం టుందని పేర్కొన్నారు. కేంద్రం ఈ దిశగా చర్యలు తీసుకుంటే కరోనా పూర్వస్థితికి ఎంఎస్ఎంఈలు చేరుకుంటాయన్న ఆశాభావం వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సూచిస్తున్న ఈ సహాయక చర్యలు వెంటనే చేపట్టాలని మంత్రి కేటీఆర్ తన లేఖలో విజ్ఞప్తిచేశారు.
దేశ వ్యాప్తంగా పలు రాష్ర్టాలు కరోనాపై పరిమితులు సడలించడంతోపాటు ఆర్థిక కార్యకలాపాలు గాడిలో పడుతున్న నేపథ్యంలో నాలుగో త్రైమాసికంలో ఎంఎస్ఎంఈలు పూర్తిస్థాయిలో తమ కార్యకలాపాలు ప్రారంభించాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం అనివార్యమన్నారు. గత ఐదు శతాబ్దాలుగా హైదరాబాద్ చుట్టుపక్కలగల జిల్లాల్లో ఎంఎస్ఎంఈలు పెద్ద ఎత్తున విస్తరించాయని, గతంలో ఎన్నడూ లేనివిధంగా కరోనా వల్ల తలెత్తిన ఇబ్బందులతో అవి ఇబ్బందుల్లో కూరుకుపోయాయని కేటీఆర్ లేఖలో వివరించారు.