హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ)/ కొత్తగూడెం క్రైం: ప్రభుత్వం మధ్యవర్తుల పేర్లను ప్రకటిస్తే తమ వద్ద బందీగా ఉన్న కోబ్రా కమెండో రాకేశ్వర్ సింగ్ను అప్పగిస్తామని మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ పేరుతో మంగళవారం ఓ లేఖ విడుదలయింది. అప్పటివరకు జనతన సర్కార్ల రక్షణలో అతను క్షేమంగా ఉంటాడని తెలిపారు. చర్చలకు తాము ఎప్పుడూ సిద్ధమేనని, చర్చల విషయంలో ప్రభుత్వానికే చిత్తశుద్ధిలేదని ఆరోపించారు. పోలీసులతో తమకెలాంటి శత్రుత్వం లేదని, కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్ట్ విధానాలకే తాము వ్యతిరేకమన్నారు. ఇటీవలి ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీకి చెందిన నలుగురు పీఎల్జీఏ సభ్యులు మృతిచెందినట్టు వెల్లడించారు. ఘటనా స్థలంనుంచి జవాన్లకు సంబంధించిన 14 ఆయుధాలు, 2 వేల తూటాలు, ఇతర ఆయుధసామగ్రిని పీఎల్జీఏ స్వాధీనపరుచుకున్నట్టు లేఖలో వెల్లడించారు. మరోవైపు, ఎన్కౌంటర్ జరిగినప్పుడు డ్రోన్ సాయంతో తీసినట్లు ఉన్న వీడియో సోషల్ మీడియాలో మంగళవారం ప్రత్యక్షమైంది. జవాన్లు కొండరాళ్ల వెనకాల ఉండి నక్సల్ తూటాల వర్షం నుంచి తమనుతాము కాపాడుకోవటం, ప్రాణాలు కోల్పోయిన పలువురు జవాన్ల మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యాలు అందులో కనిపించాయి. మరణించిన తమ సహచరుల అంతిమయాత్రలో భారీ ఎత్తున మావోయిస్టులు పాల్గొన్న మరో వీడియో కూడా సోషల్ మీడియాలో విడుదలైంది.
ఇవి కూడా చదవండి..
బీజేపీ ఎంపీని ఘెరావ్ చేసిన రైతులు
పంజాబ్ నుంచి యూపీకి గ్యాంగ్స్టర్ తరలింపు
మీలాగే.. మేం హిందువులకు పిలుపునిస్తే..
పోలింగ్ ప్రశాంతం.. తీర్పు నిక్షిప్తం
సర్వోన్నత న్యాయపీఠంపై తెలుగు తేజం