చెన్నై: అన్నా డీఎంకే బహిష్కృత నేత వీకే శశికళ మళ్లీ రాజకీయాల్లోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా ఓ పార్టీ నేతతో మాట్లాడిన ఫోన్ కాల్లో ఆమే ఈ విషయాన్ని వెల్లడించింది. కొవిడ్-19 మహమ్మారి ముగిసిన తర్వాత తాను మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నట్లు ఆమె చెప్పింది. దీనికి సంబంధించిన ఆడియో బయటకు వచ్చింది. తాను కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తానని, ఏఐఏడీఎంకే పార్టీని గాడిలో పెడతానని శశికళ స్పష్టం చేసింది. ఈ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఏం బాధపడకండి. నేను కచ్చితంగా తిరిగి వస్తా. పార్టీని గాడిలో పెడతా. ధైర్యంగా ఉండండి. కరోనా ముగియగానే నేను వస్తా అని శశికళ చెప్పడం ఆ ఆడియో క్లిప్లో వినిపిస్తుంది. మేము మీ వెంటే ఉంటామని పార్టీ క్యాడర్ చెప్పడం కూడా అందులో వినిపించింది. ఈ కాల్ నిజమేనని, ఈ విషయాన్ని ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి దినకరన్ వ్యక్తిగత సహాయకుడు జనార్దనన్ ధృవీకరించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తమిళనాడు ఎన్నికల్లో కీలకపాత్ర పోసిస్తుందని భావించిన శశికళ అనూహ్యంగా రాజకీయాల్లో నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో అన్నా డీఎంకే ఓడిపోవడంతో శశికళ మరోసారి రాజకీయాల్లోకి రావడంపై చర్చ మొదలైంది.