షిమ్లా : కొవిడ్-19 నిబంధనలు ఉల్లంఘించే వ్యక్తులకు రూ.5వేల జరిమానాతో పాటు ఎనిమిది రోజుల జైలు శిక్ష విధించనున్నట్లు మనాలి పరిపాలన హెచ్చరించింది. హిమాచల్ప్రదేశ్లోని పర్యాటక ప్రాంతాలకు ఇటీవల టూరిస్టులు పెద్ద సంఖ్యలో తరలిరాగా.. ఫొటోలు.. వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఈ క్రమంలో అధికారులు స్పందించి కొత్త మార్గదర్శకాలు రూపొందించారు. గత ఏడు రోజుల్లో రూ.3 లక్షలకుపైగా చలాన్లు జారీ చేసినట్లు కులు ఎస్పీ గురుదేవ్ శర్మ తెలిపారు. ఇటీవల హిమాచల్ ప్రభుత్వం కొవిడ్ ఆంక్షలు సడలిస్తున్నట్లు ప్రకటించగా.. భారీగా పర్యాటకులు తరలివచ్చారు. రోడ్లపై గుంపులుగా కనిపించడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమయ్యాయి.
జూన్ నుంచి సుమారు 6-7లక్షల మంది వరకు పర్యాటకులు వచ్చారని అంచనా. దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండడంతో పర్యాటకులు షిమ్లా, మనాలి, ధర్మశాల, డల్హౌసీ, నార్కండ తదితర పర్యాటక ప్రాంతాలకు తరలివస్తున్నారు. మహమ్మారి మధ్య ఈ ప్రారంభంలో హిమాచల్ ప్రదేశ్లో పర్యాటకులు పెద్ద సంఖ్యలో గుంపులు గుంపులుగా తిరుగుతుండడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఇది కరోనా థర్డ్ వేవ్కు దారితీయొచ్చని, పర్యాటకులను గుంపులుగా తిరుగనివ్వొద్దని కేంద్రం ఆ రాష్ట్ర సర్కారుకు లేఖ రాసింది. పర్యాటక ప్రదేశాల్లో యాత్రికులు కరోనా మార్గదర్శకాలు పాటించకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు హెచ్చరించింది.