న్యూఢిల్లీ : కొవిడ్-19 నిబంధనలను ప్రజలు సక్రమంగా పాటిస్తే కరోనా వైరస్ అన్ని వేరియంట్ల నుంచి ప్రజలు సురక్షితంగా ఉంటారని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్దీప్ గులేరియా అన్నారు. డెల్టా ప్లస్ వేరియంట్ ముప్పు గురించి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి తీవ్రంగా ఉంటుందని, అధిక మరణాలు సంభవిస్తాయనే దానిపై సరైన సమాచారం లేదని స్పష్టం చేశారు.
వ్యాధి నిరోధక శక్తి నుంచి ఇది తప్పించుకుంటుందనే దానిపైనా స్పష్టత లేదని అన్నారు. మనం కొవిడ్-19 నిబంధనలు పాటిస్తే ఎలాంటి వేరియంట్లు వ్యాప్తి చెందినా సురక్షితంగా ఉంటామని చెప్పారు. రెండు భిన్న వ్యాక్సిన్లను కలిపి ఇవ్వడంపై మరింత సమాచారాన్ని విశ్లేషించిన తర్వాతే నూతన వ్యాక్సినేషన్ వ్యూహం చేపట్టాలని పేర్కొన్నారు. మరోవైపు ఢిల్లీలో ఇంతవరకూ డెల్టా ప్లస్ వేరియంట్ కేసు వెలుగుచూడలేదని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ వెల్లడించారు.