ఆడవారి బాధ పట్టదా?
మహిళలపట్ల వివక్ష అన్ని రంగాల్లోనూ, అన్ని సందర్భాల్లోనూ కనిపించేదే. కానీ, ఎదుటి మనిషి నొప్పితో విలవిల్లాడిపోతుంటే.. ఆ వ్యక్తి మగవారైతే ఒకలా, ఆడవారైతే మరోలా స్పందిస్తామా? ఆశ్చర్యంగా ఉన్నా.. అవుననే అంటున్నారు మియామీ విశ్వవిద్యాలయ పరిశోధకులు. ఇందుకోసం వాళ్లు తమ దగ్గరున్న వాటిలోంచి భుజం నొప్పితో బాధ పడుతున్న రోగుల వీడియోలను బయటకు తీశారు. వాటిని కొందరికి చూపించి, నొప్పిని అంచనా వేయమని చెప్పారు. ఆశ్చర్యంగా, ఆ వీడియోల్లో ఉన్నది ఆడవారా? మగవారా? అన్నది ఆ అంచనామీద ప్రభావం చూపింది. ఒకే రకం సమస్యతో బాధపడుతూ, అంతే నొప్పిని భరిస్తున్న మహిళల వేదనను వారు తక్కువగా అంచనా వేశారట. “మగవారు ఎంతటి నొప్పినైనా భరించగలరు. ఆడవారు చిన్నపాటి నొప్పికే కంగారు పెట్టేస్తుంటారు. కాబట్టి, మగవాళ్లు నొప్పితో అరుస్తుంటే, అది తీవ్రంగా ఉండి ఉంటుంది” అనే అభిప్రాయమే వీరి తప్పుడు అంచనాలకు కారణమని పరిశోధకులు తేల్చారు. విచిత్రం ఏమిటంటే, ఎదుటివారి నొప్పిని బేరీజు వేయడంలో మహిళలు కూడా తడబడ్డారట. చికిత్స విషయంలోనూ సాటి మనుషుల వేదనను గమనించడంలోనూ.. ఈ పక్షపాత ధోరణిని కాస్త అదుపు చేసుకోవాలని సూచిస్తున్నారు పరిశోధకులు.
సుఖనిద్రా ప్రాప్తిరస్తు!
మనిషి ఆరోగ్యానికి నిద్ర ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రోజుకు కనీసం ఏడు గంటల నిద్ర ఉండాలనీ, అందులో కొంతభాగం శరీరానికి పూర్తి విశ్రాంతి కలిగించేంత గాఢంగా ఉండాలనీ చెబుతుంటారు పరిశోధకులు. తాజాగా, సరైన నిద్ర లేకపోవడానికీ ఆయుష్షుకూ సంబంధం ఉందా అన్నది తెలుసుకునే ప్రయత్నం చేశారు బ్రిగామ్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్కు చెందిన పరిశోధకులు. ఇందుకోసం వాళ్లు 2,610 మంది వృద్ధులనుంచి కొంత సమాచారాన్ని రాబట్టారు. “మీరు రోజుకు ఎన్ని గంటలు నిద్రపోతారు? గాఢనిద్రలోకి జారుకునేందుకు ఎంత సమయం పడుతుంది? మధ్యమధ్యలో మెలకువ వస్తుందా?” లాంటి ప్రశ్నలను సంధించి, జవాబులను నమోదు చేశారు. ఐదేండ్ల తర్వాత, నాటి జవాబుల ఆధారంగా వీరి నిద్రకూ, ఆయుర్దాయానికీ ఉన్న సంబంధాన్ని కనుగొన్నారు. రోజుకు ఐదు గంటలకంటే తక్కువగా నిద్రపోతున్నవారు త్వరగా చనిపోతున్నట్లు తమ పరిశోధనలో తేల్చారు. పైగా వీరిలో మతిమరుపు లాంటి సమస్యలు తలెత్తడాన్నీ గుర్తించారు.
ఊబకాయానికి మందు?
ప్రపంచాన్ని కమ్మేస్తున్న మహమ్మారి ఊబకాయం. మారుతున్న ఆహారపు అలవాట్లు, కదలకుండా సాగిపోయే జీవన విధానం.. బక్కపలుచ వ్యక్తిని కూడా స్థూలకాయునిగా మార్చేస్తున్నాయి. ‘సాయంత్రం నుంచి తిండిని తగ్గించాలి, రేపటినుంచి వాకింగ్ చేయాలి’ లాంటి ప్రతిజ్ఞలేవీ సాకారం కావడం లేదు. దీంతో ఊబకాయాన్నీ, తోడుగా వచ్చే ప్రాణాంతక సమస్యలనూ భరిస్తున్నారు చాలామంది. ఓ తాజా పరిశోధన ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తున్నది. మనం ఆహారం తీసుకోవడంలో మెదడు పాత్ర కీలకమైంది. రుచికరమైన లేదా ఇష్టమైన ఆహారాన్ని తీసుకున్నప్పుడు మెదడులో ‘డోపమైన్’ హార్మోన్ విడుదలవుతుంది. ఇది ఒకరకమైన సంతృప్తిని కలిగిస్తుంది. ఆ సంతృప్తి కోసమే, కొందరు ఆహారాన్ని వ్యసనంగా మార్చుకుంటారు. అయితే, ‘లెప్టిన్’ అనే మరో హార్మోన్ను నియంత్రించడం ద్వారా.. ‘తినడం ఇక చాలు’ అనే సంకేతాన్ని మెదడుకు అందించవచ్చని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఎలుకల్లో లెప్టిన్ హార్మోన్ శాతాన్ని పెంచినప్పుడు, అవి ఆహారం జోలికి పోకుండా ఉండటాన్ని గమనించారు. ఇదే చికిత్సను ఊబకాయులకూ అందించే ప్రయత్నంలో ఉన్నారు.
సౌందర్యం.. అనారోగ్యం
లిప్స్టిక్, నెయిల్ పాలిష్, హెయిర్ డై, ఫేస్ క్రీమ్.. ఇవన్నీ సౌందర్యాన్ని పెంచే ముడిసరుకులే. కానీ, ఆడవాళ్లను అందంగా చూపించే వీటి వెనుక ఎంతో విషాదం దాగి ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. మహిళల్లో ఇవి ఎండోమెట్రియాసిస్ అనే వ్యాధిని కలిగిస్తాయని హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధి వల్ల కడుపు నొప్పి, సంతానలోపం లాంటి అనేక సమస్యలు కలుగుతాయని చెబుతున్నారు. సౌందర్య సాధనాల్లో ఉండే పారబిన్, బెంజోఫెనోన్ లాంటి రసాయనాలు శరీరంలోని హార్మోన్లను దెబ్బతీస్తాయి. తద్వారా ఎండోమెట్రియాసిస్ను కలిగిస్తాయి. స్పెయిన్లోని 124 మంది మహిళలను గమనించాక, ఈ విషయం స్పష్టమైంది. వీరిలో సౌందర్య సాధనాలు వాడే అలవాటు ఉన్నవారిలో, ఎండోమెట్రియోసిస్ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా కనిపించింది. పరిశోధకులు ఈ సమస్యకు విరుగుడేమీ సూచించలేదు. కాబట్టి, మితమైన వాడకమే మార్గమని తేలిపోతున్నది.