కోల్కతా: ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి పోలింగ్ రోజున పశ్చిమ బెంగాల్కు ఎందుకు వస్తున్నారని, ఎన్నికల రోజున ఇక్కడ ఎందుకు ప్రచారం చేస్తున్నారని సీఎం మమతా బెనర్జీ ప్రశ్నించారు. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో మనం ప్రచారం చేయలేకపోతున్నామని, మరోవైపు దూరదర్శన్తో సహా అన్ని సౌకర్యాలతో మోదీ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడం కాదా అని ఆమె ప్రశ్నించారు.
బీజేపీ నేతలు, ఆ పార్టీ గూండాలకు మాత్రమే సహాయం చేయాలని సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఇతర జవాన్లకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ఆదేశిస్తున్నారని మమత ఆరోపించారు. ఈసీకి ఎన్నో లేఖలు రాసినా బీజేపీ అభ్యర్థులకే మద్దతిస్తున్నదని విమర్శించారు. ఈసీ మౌనం వహించడంపై క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు. ఈసీకి 63 ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోయిందని అన్నారు.
నందిగ్రామ్ గురించి గాక ప్రజాస్వామ్యం గురించి తాను ఆందోళన చెందుతున్నట్లు మమత తెలిపారు. తల్లి, ఈ భూమి, మనుషుల ఆశీస్సులతో నందిగ్రామ్ నుంచి తాను తప్పక గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు మమత మరో స్థానం నుంచి పోటీ చేయబోరని టీఎంసీ స్పష్టం చేసింది. ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు ఈ మేరకు కౌంటర్ ఇచ్చింది.