సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 16 : గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, రాత్రి బస చేసి పారిశుధ్యం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మెదక్, సిద్దిపేట కలెక్టర్, అదనపు కలెక్టర్లు, డీఎఫ్వోలు, డీపీవోలు, డీఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులను ఆదేశించారు. బుధవారం బీఆర్కేఆర్ భవన్ నుంచి స్థానిక సంస్థల నిర్వహణ పనితీరులో మెరుగుదల, తెలంగాణకు హరితహారం, ధరణి, వ్యాక్సినేషన్పై మాట్లాడుతూ సీఎం కేసీఆర్ విజన్ మేరకు అధికారులు పనిచేయాలని సూచించారు. పారిశుధ్యం, పచ్చదనం, గ్రామ సభల నిర్వహణ, ప్రగతి నివేదికల తయారీ సీజనల్ క్యాలెండర్ తదితర అంశాలపై దృష్టి సారించాలన్నారు. ధరణిలో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం, స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు, వెజ్, నాన్వెజ్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లకు స్థలాలు అప్పగించడం తదితర అంశాలను చర్చించారు. వ్యాధుల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎస్ కలెక్టర్లను ఆదేశించారు.
మెదక్ జిల్లాలో 35 లక్షల మొక్కలు
నాటేందుకు ప్రణాళికలు..
మెదక్ జిల్లాలో ఏడో విడత హరితహారంలో 35 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించామని కలెక్టర్ తెలిపారు. అందుకనుగుణంగా గుంతలు తీసి వర్షాలు పడిన వెంటనే మొక్కలు నాటేందుకు సిద్ధం చేయాలని డీఆర్డీవో, డీఎఫ్వో, డీపీవోలను ఆదేశించినట్లు చెప్పారు. చారు. మెదక్ పట్టణంలో మిషన్ భగీరథ పనులను వెంటనే పూర్తయ్యేలా చూడాలన్నారు. సీఎం కేసీఆర్ పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం, వైకుంఠధామాల ప్రగతిని సమీక్షిస్తున్నారని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో మెదక్ అదనపు కలెక్టర్లు రమేశ్, వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో కైలాష్, డీఆర్డీవో శ్రీనివాస్, డీపీవో తరుణ్కుమార్, డీఎఫ్వో జ్ఞానేశ్వర్, డీఎంహెచ్వో వెంకటేశ్వర్రావు, సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు.
నేటి నుంచి ఆకస్మిక తనిఖీలు
జిల్లాలోని పల్లె, పట్టణ ప్రగతి మెరుగుపడాలని సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్ నుంచి మున్సిపల్ కమిషనర్లు, ఇంజినీర్లు, మండల ప్రత్యేకాధికారులు, ఏపీడీ, టీపీవో, ఎంపీడీవో, డీఎల్పీవో, ఎంపీవో, పంచాయతీ కార్యదర్శులతో పారిశుధ్య నిర్వహణ, హరితహారంపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో పెద్దఎత్తున పారిశుధ్య నిర్వహణ చేపట్టాలన్నారు. త్వరలో సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన చేయనున్నారని, ఎప్పుడైనా జిల్లాకు రావచ్చన్నారు. రేపటి నుంచి గ్రామాల్లో తనిఖీలు చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. నర్సరీల్లో ఎండిన మొక్కలు ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవెన్యూ ప్లాంటేషన్ మొక్కలను ట్రిమ్మింగ్ చేయాలనే పలు సూచనలు చేశారు. జిల్లాలో ఆర్అండ్బీ రోడ్లు, పంచాయతీ రహదారుల్లో ఎవెన్యూ ప్లాంటేషన్ పనులు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లాలో అధికారులు వారంలో ఒకరోజు పల్లెనిద్ర చేస్తామన్నారు. అక్రమ నిర్మాణాలు, అనుమతులు లేని లే అవుట్లను సహించేది లేదన్నారు. ప్రతినెలా 1,11,21 తేదీల్లో తాగునీటి ట్యాంకులు క్లోరినేషన్ చేయించాలన్నారు. అందరూ సమష్టిగా పనిచేయాలని కలెక్టర్ అధికారులను కోరారు. కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ రాజర్షి షా, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాసరావు, డీపీవో సురేశ్ మోహన్, డీఎఫ్వో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.