వ్యాక్సినేషన్లో వయసు విభజన సమంజసమా?
గ్రామీణులకు ‘కొవిన్’పై అవగాహన ఉంటుందా?
టీకా పాలసీపై కేంద్రానికి సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం
న్యూఢిల్లీ, మే 31: కరోనా నియంత్రణలో భాగంగా కేంద్రప్రభుత్వం నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంపై సుప్రీంకోర్టు సోమవారం అసంతృప్తి వ్యక్తం చేసింది. టీకా విధానం-సేకరణ, గ్రామీణ ప్రాంతాల్లో టీకా రిజిస్ట్రేషన్, టీకా ధరల్లో తేడా తదితర సమస్యలపై కేంద్రాన్ని ఆరా తీసింది. అలాగే, మూడోదశలో పిల్లలు, గ్రామీణులపై వైరస్ పంజా విసురనున్నదన్న నివేదికలపై ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంపై ఏదైనా అధ్యయనాన్ని నిర్వహించారా అని కేంద్రాన్ని ప్రశ్నించింది.
కేంద్రానికి సుప్రీంకోర్టు ప్రధాన ప్రశ్నలు..
టీకా విధానం-సేకరణ: వ్యాక్సినేషన్ విధానంలో వయస్సును బట్టి విభజన ఎందుకు? టీకాల సేకరణలో భిన్న విధానాలను ఎందుకు తీసుకొచ్చారు? 45 ఏండ్లు పైబడిన వారిపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటం వల్లనే ఈ విధానం తీసుకొచ్చామంటే, రెండోదశలో 18-44 ఏండ్ల వారిపైనా వైరస్ తీవ్ర ప్రభావాన్ని చూపించింది కదా!
గ్రామీణ ప్రాంతాల్లో టీకా రిజిస్ట్రేషన్: టీకా వేసుకోవాలంటే ‘కొవిన్’ పోర్టల్లో పేర్ల నమోదు తప్పనిసరి అని నిబంధన పెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇది సాధ్యమేనా? గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కంప్యూటర్, ఇంటర్నెట్పై అవగాహన ఉంటుందని నిర్ధారణకు వచ్చారా? క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఆకలింపు చేసుకొని నిర్ణయాలు తీసుకోవాలి.
టీకా ధరల్లో తేడా: వ్యాక్సినేషన్లో ఒకే రకమైన టీకాలను వేస్తున్నప్పుడు వాటి ధరల్లో వ్యత్యాసమెందుకు? తయారీ సంస్థలు టీకా డోసులను కేంద్రానికి ఒక ధరకు, రాష్ర్టాలకు ఎక్కువ ధరకు ఎందుకు విక్రయిస్తున్నాయి? కంపెనీలే వ్యాక్సిన్ల ధరలను ఎలా నిర్ణయించాయి?: టీకాల కొరత రాకుండా కేంద్రమే చర్యలు చేపట్టాలి. వ్యాక్సిన్ డోసులు లేకపోవడంతో పలు రాష్ర్టాలు గ్లోబల్ టెండర్లకు వెళ్లాయి. అది అంత మంచిది కాదు. కేంద్రమే ఆ బాధ్యతను తీసుకుని సమస్యను పరిష్కరించాలి.