యాదాద్రి భువనగిరి, మే 16(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లాలో మే 6 నుంచి 10వ తేదీ వరకు ఐదు రోజులపాటు ఇంటింటి సర్వే చేపట్టారు. ప్రతి వెయ్యి మందికి ఒక బృందం చొప్పున ఏఎన్ఎం, ఆశ, అంగన్వాడీ వర్కర్, పంచాయతీ అధికారులు, మున్సిపల్ అధికారులతో ఏర్పాటు చేసిన బృందాలు వార్డుల వారీగా పర్యటించి ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించాయి. ప్రతి ఇంట్లో ఎంత మంది సభ్యులున్నారు? వారిలో ఎవరికైనా జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా? అని క్షుణ్ణంగా విచారించారు. ప్రజలు ఇచ్చిన వివరాలన్నింటినీ కుటుంబాల వారీగా నమోదు చేసుకున్నారు. ఆయా కుటుంబాల్లో ఎవరెవరు వ్యాక్సిన్ తీసుకున్నారు? ఎవరు తీసుకోలేదన్న వివరాలను కూడా సేకరించారు. ఎవరి ఇంట్లోనైనా జ్వరం, దగ్గు, జలుబు, ఇతర లక్షణాలు ఉన్నట్లు కనిపిస్తే వెంటనే వారికి అజిత్రోమైసిన్, విటమిన్-సీ, జింకోవిట్, డోలో 650, సిట్రిజన్ టాబ్లెట్లతోపాటు శానిటైజర్, గ్లౌజ్లు, మాస్కులతో కూడిన హెల్త్ కిట్లను ఇంటి వద్దనే అందజేశారు. లక్షణాలు తీవ్రంగా ఉన్నవారిని సమీపంలోని దవాఖానకు తరలించి అవసరమైన తక్షణ వైద్య సాయాన్ని అందజేశారు. జిల్లాలో 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు 137 వరకు ఉన్న సబ్ సెంటర్లలో కొన్నింటిలో ఓపీ సేవలను సైతం ప్రారంభించారు. అవసరమైన వారికి హెల్త్ కిట్లను అందజేస్తున్నారు. కిట్లలోని మందులను ఐదురోజులపాటు వాడితే కరోనా తీవ్రస్థాయికి చేరకుండా చేయవచ్చని వైద్య సిబ్బంది ఈ సందర్భంగా బాధితులకు వివరిస్తూ భరోసా కల్పిస్తున్నారు.
పెరుగుతున్న రికవరీ రేటు..
కరోనా బారిన పడ్డవారిలో చాలా మంది కొద్ది రోజుల్లోనే కోలుకుంటున్నారు. కొందరు హోం ఐసొలేషన్లో ఉండే కోలుకుంటుండగా, ప్రభుత్వ ఐసొలేషన్లలో చికిత్స పొందిన వారు సైతం తక్కువ వ్యవధిలోనే నయమై ఇండ్లకు తిరిగి వస్తున్నారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి తక్షణ చర్యలు చేపడుతున్నా ఫలితంగా రికవరీ రేటు గతంలో కంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఉంటున్నది. ప్రభుత్వ ఐసొలేషన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్న వారికి సైతం మెరుగైన వైద్య సేవలను అందిస్తుండటంతో విషమ పరిస్థితిలో ఉన్నవారు సైతం కోలుకుని ఇండ్లకు వెళ్లిపోతున్నారు. భువనగిరి ఏరియా దవాఖానలో ఉన్న 20 బెడ్లకు ఆక్సిజన్ సదుపాయం ఉండగా, బీబీనగర్ ఎయిమ్స్లో ఉన్న 50 బెడ్లలో 24 వరకు ఆక్సిజన్ బెడ్లు ఉన్నాయి. రామన్నపేట దవాఖానలో ఉన్న 24 బెడ్లలో 5 ఆక్సిజన్ బెడ్లు, చౌటుప్పల్ దవాఖానలో 16 బెడ్లు, ఆలేరు దవాఖానలో 21 బెడ్లు ఉండగా, వీటిల్లో ఐదు చొప్పున ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయి. నిరంతరం పర్యవేక్షించేందుకు వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండటంతో గణనీయంగా కరోనా కేసులు తగ్గుతున్నాయి.
జ్వర బాధితులకు ఇంటికే వైద్యం
రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి నిర్వహించిన జ్వర సర్వే సత్ఫలితాలను ఇచ్చింది. గ్రామాల్లో ఎక్కువ మంది కరోనా బారిన పడకుండా ఉండటానికి ఎంతో దోహ దం చేసింది. ప్రజలకు ఆరోగ్యపరమైన విషయాల పట్ల మరింత అవగాహన పెరిగింది. జ్వరం, ఇతర జబ్బులను గుర్తించిన వారి ఇండ్ల వద్దకే వైద్య సిబ్బంది ద్వారా మందులు, ఇతర వైద్య సదుపాయాలను అందిస్తున్నాం. సర్వేతో కరోనా బారినపడే వారి సంఖ్య చాలా తగ్గుముఖం పట్టింది. భౌతిక దూరం పాటించి మాస్కులు ధరించి తగిన జాగ్రత్తలు పాటిస్తే కరోనా వ్యాప్తి మరింత దూరం కానున్నది.
వైద్యుల సేవలతో కోలుకున్నాను..
గత ఫిబ్రవరిలో నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వెంటనే హోం క్వారంటైన్కు వెళ్లాను. యాదగిరిగుట్ట పీహెచ్సీ నుంచి ఓ ఆశ వర్కర్ వచ్చి కొవిడ్ కిట్ను అందజేసి పలు సూచనలు చేశారు. నిత్యం మందులు ఎలా వాడుకోవాలో, మా కుటుంబసభ్యులకు కరోనా వాటిల్లకుండా జాగ్రత్తలను సూచించారు. 17రోజుల పాటు హోం క్వారంటైన్లోనే ఉన్నాను. కరోనాతో పోరాడి సంపూర్ణ ఆరోగ్యంతో బయటపడ్డాను.