న్యూఢిల్లీ : కరోనా థర్డ్ వేవ్ పెద్దలతో పోలిస్తే చిన్నారులపై అధిక ప్రభావం చూపబోదని డబ్ల్యూహెచ్ఓ-ఎయిమ్స్ చేపట్టిన సెరోప్రివలెన్స్ అథ్యయనం స్పష్టం చేసింది. సర్వేలో వయోజనులతో పోలిస్తే పిల్లల్లో సెరో-పాజిటివిటీ రేటు (యాంటీబాడీలు) అధికంగా ఉందని వెల్లడైంది. అథ్యయనంలో భాగంగా ఐదు ఎంపిక చేసిన రాష్ట్రాల్లోని పదివేల నమూనాలను పరీక్షించారు. మరో మూడు నెలల్లో పూర్తిస్థాయి ఫలితాలు రానుండగా మధ్యంతర విశ్లేషణలో ఈ అంశాలను నిగ్గుతేల్చారు.
ఢిల్లీలోని అత్యంత జనసమ్మర్థ కాలనీల్లో అత్యధికంగా 74.7 శాతం సెరోప్రివలెన్స్ ఉన్నట్టు వెల్లడైందని అథ్యయనానికి సారథ్యం వహించిన ఎయిమ్స్ కమ్యూనిటీ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ పునీత్ మిశ్రా తెలిపారు. సెకండ్ వేవ్ ప్రారంభానికి ముందు కూడా ఢిల్లీలో 18 ఏండ్లలోపు చిన్నారుల్లో దాదాపు 75 శాతం సెరోప్రివలెన్స్ ఉందని, సెకండ్ వేవ్ తర్వాత ఇది మరింత పెరగవచ్చని డాక్టర్ మిశ్రా పేర్కొన్నారు.
ఈ సెరోప్రివెలెన్స్ స్థాయిలు థర్డ్ వేవ్ ను అడ్డుకోచ్చని చెప్పారు. ఢిల్లీలోని చిన్నారుల్లో సెరోప్రివలెన్స్ అధికంగా ఉండటంతో స్కూల్స్ ను తెరవడం రిస్క్ కాబోదని అన్నారు. ఇక యూపీలోని గోరఖ్ పూర్ వంటి గ్రామీణ ప్రాంతాల్లో 80 నుంచి 90 శాతం సెరోప్రివెలెన్స్ ఉండటం థర్డ్ వేవ్ ముప్పును నివారించవచ్చని అన్నారు. గోరఖ్ పూర్ ప్రాంతంలో కరోనా వ్యాప్తి అధికంగా ఉండటం మూలంగా అక్కడ హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చిందని డాక్టర్ మిశ్రా చెప్పుకొచ్చారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 62 శాతం మందికి పైగా గతంలో కరోనా ఇన్ఫెక్షన్ బారినపడినట్టు సర్వేలో వెల్లడైంది.