న్యూఢిల్లీ: కరోనా మృతుల డెత్ సర్టిఫికెట్ల జారీపై కేంద్ర ఆరోగ్యశాఖ, ఐసీఎంఆర్ సంయుక్తంగా కొత్తగా మార్గదర్శకాలు జారీచేసినట్టు కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. కరోనా మృతుల డెత్ సర్టిఫికెట్లలో మరణానికి గల కారణాలను స్పష్టంగా పేర్కొనడం లేదని, సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ కూడా సంక్లిష్టంగా ఉందని.. ఫలితంగా బాధితులు పరిహారం పొందే అవకాశం కోల్పోయే ప్రమాదం ఉందని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. మరణ ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియను సులభతరం చేయాలని, మరణానికి గల కారణాలను సర్టిఫికెట్లలో స్పష్టంగా పేర్కొనాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ మేరకు ఈ నెల 11లోగా కొత్త మార్గదర్శకాలు జారీచేయాలని గతంలో సూచించింది. ఈ నేపథ్యంలోనే కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు శనివారం అఫిడవిట్ సమర్పించింది. ఈ నెల 3నే మార్గదర్శకాలను జారీచేసినట్టు అందులో పేర్కొన్నది.