న్యూఢిల్లీ, మే 26: సోషల్మీడియాలో డిజిటల్ కంటెంట్పై నియంత్రణ కోసం కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనలను సవాల్ చేస్తూ వాట్సాప్ మంగళవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కొత్త నిబంధనలు యూజర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా ఉన్నాయని, అవి రాజ్యంగవిరుద్ధమని పిటిషన్లో ఆరోపించింది. అయితే, పౌరుల వ్యక్తిగత గోప్యతను కాపాడటానికి తాము కట్టుబడి ఉన్నామని కేంద్రప్రభుత్వం వెల్లడించింది.
అన్ని సందేశాలు ఎలా చూస్తాం?
తమ యాప్లో పోస్ట్ అయ్యే చాట్లకు సంబంధించిన మూలాలను (మెసేజ్ పెట్టిన వ్యక్తి, ప్రదేశం తదితరాలు) కనిపెట్టి ప్రభుత్వానికి తెలియజేయాలంటూ కొత్త నిబంధనలు పేర్కొంటున్నాయని వాట్సాప్ పిటిషన్లో ఆరోపించింది. తమ వినియోగదారుల మెసేజ్లను చదివి ప్రభుత్వానికి ఇవ్వడం అంటే పౌరుల వ్యక్తిగత గోప్యత హక్కులను ఉల్లంఘించినట్లేనని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. ఇది తమ ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్కు వ్యతిరేకమని వెల్లడించింది. ‘వైద్యుడు-రోగి మధ్య ఆరోగ్యంపై సంభాషణ జరుగొచ్చు. లాయర్-క్లయింట్ మధ్య కేసులపై చర్చ సాగొచ్చు. ఇందులో ఏ సందేశాన్ని అభ్యంతరకర మెసేజ్గా పరిగణించాలి. అలా గుర్తించాలంటే అన్ని సందేశాల్ని చదవాల్సిందే. ఇది ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్కు విరుద్ధం’ అని వాట్సాప్ పేర్కొన్నది. మరోవైపు, పౌరుల వ్యక్తిగత గోప్యతను కాపాడటానికి తాము కట్టుబడి ఉన్నామని, దాన్ని ఉల్లంఘించాలన్న ఉద్దేశం తమకు లేదని కేంద్రప్రభుత్వం పేర్కొంది. అయితే దేశ భద్రత, శాంతి భద్రతలను పరిరక్షించే క్రమంలో గోప్యతహక్కుతోసహా అన్ని ప్రాథమిక హక్కులు సంపూర్ణమైనవిగా పరిగణించలేమని, వాటిపై కూడా కొన్ని ఆంక్షలు విధించాల్సిన అవసరమున్నదని అభిప్రాయపడింది. ఇంకోవైపు, వాట్సాప్ ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నదని ప్రముఖ ఐటీ రంగ నిపుణుడు టీవీ మోహన్దాస్ పాయ్ మండిపడ్డారు.
ఏమిటీ కొత్త ఐటీ నిబంధనలు?
సోషల్, డిజిటల్ మీడియా మాధ్యమాల్లో అభ్యంతరకర, విద్వేష ప్రచారాన్ని అరికట్టేందుకు ఫిబ్రవరిలో కేంద్రం కఠిన మార్గదర్శకాలను తీసుకొచ్చింది. వీటి ప్రకారం.. దేశభద్రత, సార్వభౌమత్వానికి హాని కలిగించే, విద్వేష ప్రచారాన్ని వ్యాప్తి చేసే సందేశాల పూర్తి సమాచారాన్ని కేంద్రప్రభుత్వానికి సోషల్మీడియా సంస్థలు ఇవ్వాల్సి ఉంటుంది. రైతు ఉద్యమాన్ని, జనవరి 26న హింసను సమర్థిస్తూ పలువురు ట్విట్టర్ వేదికగా పోస్టులు చేశారు. వారి ఖాతాలను తొలగించాలని కేంద్రం ఆదేశించింది. దీనిని ట్విట్టర్ వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాలపై కేంద్రం కొత్త నిబంధనలను తీసుకొచ్చింది.
మధ్యవర్తిత్వ వ్యవస్థ సమాచారం ఇవ్వండి
మధ్యవర్తిత్వ వ్యవస్థలో భాగమైన 1. చీఫ్ కంప్లెయన్స్ ఆఫీసర్, 2. నోడల్ కాంటాక్ట్ పర్సన్, 3. రెసిడెన్స్ గ్రీవియెన్స్ ఆఫీసర్ వివరాలను ఇవ్వాల్సిందిగా బుధవారం సోషల్ మీడియా సంస్థలకు కేంద్రం నోటీసులిచ్చింది. ఈ వ్యవస్థను ఇప్పటివరకూ ఏ సామాజిక మాధ్యమ సంస్థ ఏర్పాటు చేయలేదని సమాచారం. 50 లక్షల కంటే ఎక్కువ మంది యూజర్లున్న సోషల్మీడియా సంస్థలు వార్తలను పర్యవేక్షించేందుకు మధ్యవర్తిత్వ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కేంద్రప్రభుత్వం ఫిబ్రవరిలో ఆదేశించింది.