న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: నెలన్నర వ్యవధిలో 30.27 లక్షల మంది భారతీయుల అకౌంట్లపై వాట్సాప్ నిషేధం విధించింది. జూన్ 16 నుంచి జూలై 31లోపు ఈ ఖాతాలను నిషేధించినట్టు తాజా నివేదికలో వెల్లడించింది. కొత్త ఐటీ రూల్స్ ప్రకారం తన రెండో నెలవారీ నివేదికను ఇటీవల ప్రచురించింది. యూజర్ రిపోర్టులు, ప్రొఫైల్ ఫొటోలు, గ్రూప్ ఫొటోలు, డిస్క్రిప్షన్లను ఆధారంగా ఖాతాలపై నిషేధం విధించింది. వాట్సాప్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఏఐ టూల్స్ కూడా వినియోగిస్తామని వాట్సాప్ తెలిపింది.
వాట్సాప్నకు ఐర్లాండ్ 1950 కోట్ల జరిమానా
వాట్సాప్కు ఐర్లాండ్ ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. యూజర్ల గోప్యతకు భంగం కలిగించినందుకు 22.5 కోట్ల యూరోలు (దాదాపు రూ.1,950 కోట్లు) చెల్లించాలని ఆదేశించింది. ఈయూ ప్రైవసీ హక్కు పరిరక్షణ సంస్థ ఈడీపీబీ ఒత్తిడితో రికార్డుస్థాయి జరిమానాను విధించక తప్పలేదు. మొదట 5 కోట్ల యూరోల జరిమానా మాత్రమే విధించింది. ఫేస్బుక్ టర్నోవర్ను పరిగణనలోకి తీసుకోవాలని ఈడీపీబీ పేర్కొనడంతో జరిమానా మొత్తాన్ని పెంచింది.