లక్నో: ఏదేమైనా లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) అధినేత మాత్రం చిరాగ్ పాశ్వానేనని ఆర్జేడీ అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యానించారు. ములాయం సింగ్ యాదవ్ను పరామర్శించేందుకు ఉత్తరప్రదేశ్కు వెళ్లిన లాలూ యాదవ్ను ఎల్జేపీలో చీలిక గురించి మీడియా ప్రశ్నించగా ఆయన పైవిధంగా స్పందించారు. చిరాగ్ పాశ్వానే ఎల్జేపీ అధ్యక్షుడిగా కొనసాగుతాడని ఆయన చెప్పారు.
భవిష్యత్తులో చిరాగ్ పాశ్వాన్, తేజస్వియాదవ్ కూటమిగా ఏర్పడే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు.. నేను కూడా అదే కోరుకుంటున్నా అని లాలూ ప్రసాద్ సమాధానం ఇచ్చారు. తాను కేవలం ములాయం ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడానికే వచ్చానని, తమ భేటీకి, రాజకీయాలకు సంబంధం లేదని లాలూ చెప్పారు. ములాయం లేకుండా పార్లమెంట్ ఎడారిలా మారిందని పేర్కొన్నారు.
తాను శరద్ యాదవ్, ములాయం యాదవ్ పార్లమెంట్లో ఎన్నో అంశాలపై పోరాటం చేశామని లాలూ యాదవ్ గుర్తుచేసుకున్నారు. అదేవిధంగా ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్ను కుదిపేస్తున్న పెగాసస్ అంశంపై కూడా లాలూ యాదవ్ స్పందించారు. ఈ కుట్రలో ఎవరెవరు ఉన్నారో అందరి పేర్లు బయటికి రావాలని, ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని లాలూ యాదవ్ డిమాండ్ చేశారు.