చండీఘడ్ : కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న విపత్తు వేళలోనూ అక్రమార్కులు చెలరేగుతూ అడ్డదారిలో సొమ్ము చేసుకుంటున్న ఉదంతాలు వెలుగుచూస్తున్నాయి. హర్యానాలోని ఫరీదాబాద్ లో ఓ ఏసీ మెకానిక్ ఆక్సిజన్ సిలిండర్ ను రూ 45,000కు అమ్ముతూ పట్టుబడ్డాడు. సచిన్ అనే ఏసీ మెకానిక్ రూ 6000 విలువైన ఆక్సిజన్ సిలిండర్ ను రూ 45,000కు విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
తమ బంధువుకు ఆక్సిజన్ సిలిండర్ అవసరం కాగా వల్లభ్ గఢ్ జిల్లాకు చెందిన సచిన్ ను సంప్రదించగా రూ 45,000కు విక్రయిస్తానని చెప్పాడని సందీప్ అనే వ్యక్తి పోలీసులకు సమాచారం అందడంతో నిందితుడి నిర్వాకం బయటపడింది. రూ 45,000 సచిన్ ఖాతాలో జమచేసిన సందీప్ ఆక్సిజన్ సిలిండర్ ను తీసుకోకుండా అతడికి బుద్ధి చెప్పాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆక్సిజన్ సిలిండర్ తో తాను చెప్పిన ప్రాంతానికి వచ్చిన సచిన్ ను పోలీసులు అరెస్ట్ చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు.