న్యూఢిల్లీ, మే 6: కరోనా మూడో వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు కేంద్రం పూర్తి సన్నద్ధంగా ఉండాలని, దేశవ్యాప్తంగా నగరాల్లో ఆక్సిజన్ అదనపు నిల్వల కేంద్రాలను (బఫర్ స్టాక్ కేంద్రాలు) ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దవాఖానలకు ఆక్సిజన్ అవసరం పడితే బఫర్ స్టాక్ కేంద్రాలను సంప్రదించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దేశంలో కరోనా మూడో వేవ్ అనివార్యమని, అది ఇంకా ప్రమాదకరమని, ముఖ్యంగా చిన్నపిల్లలపై తీవ్ర ప్రభావం చూపవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరించిన నేపథ్యంలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ‘ఆక్సిజన్ సరఫరాపై కేంద్రం తన విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది’ అని పేర్కొన్నది. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ నిల్వలపై ఆడిట్ నిర్వహించి, వివరాలు అందుబాటులో పెట్టాలని అవసరమైన చోట తగినంత అందేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ‘కేంద్రం పంపిన ఆక్సిజన్ సరఫరా ఎలా జరుగుతున్నది? పంపిన దవాఖానకే వెళ్తుందా? బ్లాక్ మార్కెట్కు వెళ్తుందా? ఆక్సిజన్ సరఫరాపై ఏదైనా పారదర్శక వ్యవస్థ ఉన్నదా?’ అని ప్రశ్నించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకు ఢిల్లీకి రోజుకు 700 టన్నుల కంటే తక్కువగా ఆక్సిజన్ సరఫరా చేయవద్దని ఆదేశించింది.