టెక్నాలజీ పెరుగుతోంది. దీంతో డబ్బులు జేబులో పెట్టుకొని బయటికి వెళ్లే రోజులు పోయాయి. స్మార్ట్ ఫోన్ చేతుల్లో ఉంటే చాలు.. అరచేతిలో ప్రపంచం ఉంటుంది. ఎటువంటి లావాదేవీలు అయినా సరే స్మార్ట్ ఫోన్ లోనే చేసుకునే వెసులుబాటు వచ్చేసింది. మానటైజేషన్ తర్వాత నగదు చెల్లింపులు తగ్గిపోయి.. నగదు రహిత చెల్లింపుల వైపు జనాలు మళ్లారు. ఇప్పటికీ డబ్బులు జేబులో లేకున్నా.. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. లేదా క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఉంటే చాలు.. ఆన్ లైన్ లో పేమెంట్స్ చేసేయొచ్చు. నగదు రహిత లావాదేవీలకు ఈ మధ్య డిమాండ్ కూడా పెరిగింది. ఎక్కడికెళ్లినా.. కస్టమర్లు కూడా ఆన్ లైన్ లోనే డబ్బులు చెల్లించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
నగదు రహిత చెల్లింపులకు మరింత ఊతం ఇచ్చేందుకు.. ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా ఈ-రూపీ అనే డిజిటల్ పేమెంట్ సిస్టమ్ ను లాంచ్ చేశారు. ఇది ఒక ఎలక్ట్రానిక్ ఓచర్ లా పనిచేస్తుంది. దీన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఫైనాన్సియల్ సర్వీసెస్ డిపార్ట్ మెంట్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, నేషనల్ హెల్త్ అథారిటీ సంయుక్తంగా డెవలప్ చేశాయి.
ఈ- రూపీ అనేది నగదు రహిత డిజిటల్ పేమెంట్ మీడియం. ఇది ఒక ఎలక్ట్రానిక్ ఓచర్ రూపంలో ఉంటుంది. దీన్ని సంబంధిత లబ్ధిదారులకు ఎస్ఎంఎస్ రూపంలో కానీ.. క్యూఆర్ కోడ్ రూపంలో ప్రీపేడ్ గిఫ్ట్ ఓచర్ గా పంపిస్తారు. దీన్ని ఈ-రూపేను యాక్సెస్ చేసుకునే సెంటర్ల వద్ద పేమెంట్ గా చెల్లించవచ్చు. ఈ- రూపీ కోసం ఎటువంటి క్రెడిట్ కార్డు కానీ.. డెబిట్ కార్డు కానీ అవసరం లేదు. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి థర్డ్ పార్టీ వాలెట్ యాప్స్ ఏవీ అవసరం లేదు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ అవసరం లేదు. మొబైల్ బ్యాంకింగ్ అవసరం లేదు. కేవలం మీద దగ్గర ఈ-రూపీకి సంబంధించిన ఎస్ఎంఎస్ కానీ.. క్యూఆర్ కోడ్ కానీ ఉంటే చాలు. ఎక్కడైనా చెల్లింపులు చేసుకోవచ్చు.
ప్రస్తుతం కొన్ని బ్యాంకులు.. ఎన్పీసీఐతో టైఅప్ అయ్యాయి. ఆ బ్యాంకులు కస్టమర్లకు ఈ-రూపీ ఓచర్ ను అందిస్తాయి. పార్టనర్ బ్యాంకులను ముందు సర్వీస్ ప్రొవైడర్లు అప్రోచ్ అవుతారు. ప్రైవేటు, పబ్లిక్ సెక్టార్ కు చెందిన మనీ లెండర్స్ బ్యాంకుల ద్వారా తమ వినియోగదారులకు వోచర్స్ ను అందిస్తారు. వోచర్స్ ప్రకారం.. అమౌంట్ ఎంత వాడుకుంటే.. అంత అమౌంట్ ను తిరిగి వినియోగదారులు సంబంధిత మనీ లెండర్స్ ను కట్టాల్సి ఉంటుంది. కస్టమర్ ఫోన్ నెంబర్ కు వచ్చే క్యూఆర్ కోడ్ తో ఎక్కడైనా ఈ-రూపీ ద్వారా చెల్లింపులు చేసే అవకాశం ఉంటుంది.
నగదు రహిత చెల్లింపుల్లో లీకేజీని అరికట్టడం అనేది ప్రస్తుతం పెద్ద సమస్యగా మారింది. అలాగే.. పారదర్శకంగా నగదు రహిత చెల్లింపులు ఉండాలని.. అలాగే.. ప్రభుత్వాలు ప్రారంభించే సంక్షేమ పథకాలు అసలైన లబ్ధిదారులకు మాత్రమే చేరాలని.. పలు పథకాల ద్వారా ప్రయోజనాలు పొందే లబ్ధిదారులకు ఈ-రూపీ ద్వారా చెల్లింపులు చేయనున్నట్లు తెలుస్తోంది.