న్యూఢిల్లీ: ప్రముఖ రచయిత, జర్నలిస్ట్ అనిల్ ధార్కర్ ఇకలేరు. గత కొంతకాలంగా హృదయ సంబంధ అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. ధార్కర్ సాహిత్య రంగానికి ఎనలేని సేవ చేశారు. ధార్కర్ ఎన్నో అద్భుతమైన పుస్తకాలు రాశారు.
ఎంతో ప్రాచుర్యం పొందిన ది రొమాన్స్ ఆఫ్ సాల్ట్ అనే పుస్తకం ధార్కర్ కలం నుంచి జాలువారినదే. ధార్కర్ ఫిలిం ఫైనాన్స్ కార్పొరేషన్కు హెడ్గా కూడా పనిచేశారు. ప్రస్తుతం అది నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్గా పిలువబడుతున్నది.
అనిల్ ధార్కర్ మిడ్-దే, ది ఇండిపెండెంట్, ది ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా సహా పలు పత్రికలకు సంపాదకుడిగా పనిచేశారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ అడ్వయిజరీ బోర్డులో, దూరదర్శన్ అండ్ ది చిల్డ్రెన్స్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియాలో సభ్యుడిగా కూడా ధార్కర్ పనిచేశారు.
కాగా, ధార్కర్ మృతికి పాత్రికేయ, సాహిత్యరంగాలకు చెందిన ప్రముఖులతోపాటు పలువురు సంతాపం తెలిపారు. ధార్కర్ మరణవార్త తనను ఎంతగానో బాధించిందని సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ చైర్మన్ ప్రసూన్ జోషి ట్వీట్ చేశారు.
ప్రియ మిత్రుడు, స్టైలిష్ రైటర్ అని ధార్కర్కు వీడ్కోలు అని ప్రముఖ పాత్రికేయురాలు, రచయిత్రి శోభా డే ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు