సంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 24: స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం జాతీయస్థాయిలో అందజేసే ‘దీన్దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తీకరణ్’ పురస్కారాన్ని సంగారెడ్డి జడ్పీ అందుకుంది. 2019-20 సంవత్సరానికి గాను జడ్పీ చైర్పర్సన్ మంజూశ్రీ జైపాల్ రెడ్డి ఆన్లైన్ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీ నుంచి ఆన్లైన్ ద్వారా ప్రధాని మోడీ జడ్పీ చైర్పర్సన్కు అవార్డును అందజేసి అభినందనలు తెలిపారు. 37 అంశాల్లో పనితీరు ప్రమాణికంగా తీసుకుని జిల్లా ప్రజా పరిషత్కు ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ప్రశంసా పత్రం, షీల్డును అందజేసి రూ.50 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని జడ్పీ ఖాతాలో జమ చేశారు. సంగారెడ్డి కలెక్టరేట్లోని ఎన్ఐసీ విభాగం నుంచి అదనపు కలెక్టర్ రాజార్షి షా ప్రశంసా పత్రం, షీల్డును జడ్పీ చైర్పర్సన్కు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్ పర్సన్ ప్రభాకర్, జెడ్పీ సీఈఏ ఎల్లయ్య డీఆర్డీవో శ్రీనివాసరావు, డీపీవో సురేశ్ మోహన్ పాల్గొన్నారు.