కోల్కతా : పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆగస్ట్ 15 వరకూ కొవిడ్-19 నియంత్రణలను పొడిగించింది. జులై 31 నుంచి నూతన లాక్డౌన్ మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్-19 నియంత్రణలను కొన్ని సడలింపులతో ఆగస్ట్ 15 వరకూ పొడిగించినట్టు పేర్కొంది. ప్రభుత్వ కార్యక్రమాలను ఇండోర్లో 50 శాతం సీటింగ్ సామర్ధ్యంతో నిర్వహించేందుకు అనుమతించింది.
ఇక రాత్రి కర్ఫ్యూ ప్రతిరోజూ రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఐదు గంటల వరకూ అమల్లో ఉంటుందని పేర్కొంది. సగం సీట్లతో బస్సులు, ట్యాక్సీలు, రిక్షాల రాకపోకలకు వెసులుబాటు కల్పించింది. 50 శాతం సిబ్బందితో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు పనిచేస్తాయని పేర్కొంది. కొవిడ్-19 నిబంధనలను కఠినంగా అమలు జరిగేలా చూడాలని జిల్లా యంత్రాంగాలను బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హెచ్కే ద్వివేది కోరారు.