ప్రభుత్వ పథకాలు అమలు చేయాలి
గ్రామాల్లో తాగునీటి సమస్య తీర్చాలి
మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ పెందోర్ మోతీరాం
కెరమెరి, మార్చి 8 : రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి గ్రామంలో అమలయ్యేలా అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఎంపీపీ పెందోర్ మోతీరాం సూచించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన మంగళవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముందుగా ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నివేదిక చదువుతుండగా, జడ్పీటీసీ ధుర్పతాబాయి తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంత గ్రామాలతో పాటు సుర్దాపూర్లో నీటి సమస్య ఉందన్నారు. ఆ ప్రాంతంలో పనులు అసంపూర్తిగా ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పనులు వెంటనే పూర్తిచేసి, తాగునీటి సమస్య లేకుండా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు బాధ్యత వహించాలని సూచించారు. సీఎం గిరి వికాస్ ద్వారా బోరు వేసిన చోట త్రీఫేస్ విద్యుత్ సౌకర్యం పనులు చేస్తున్నామని విద్యుత్ శాఖ ఏడీఈ శ్రీనివాస్ సభ దృష్టికి తీసుకువచ్చారు.
ఇప్పటికే కొన్ని గ్రామాల్లో పనులు పూర్తిచేశామని, మరికొన్ని చోట్ల పనులు సాగుతున్నాయని తెలిపారు. కొవిడ్-19పై ప్రజలు అప్రమత్తంగా ఉండేలా ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించాలని వైద్యాధికారి సుంకన్న పేర్కొన్నారు. కరోనా రెండో దశ బలహీన పడుతున్నప్పటికీ మూడో దశపై ప్రతి ఒక్కరూ జాగ్రత్త చర్యలు పాటించాలని కోరారు. అర్హులైన వారందరూ టీకా తీసుకోవాలని సూచించారు. ఏపీవో నగేశ్ మాట్లాడుతూ.. మొక్కలు నాటేందుకు జీపీల వారీగా నివేదిక సిద్ధం చేయాలని, ఖాళీగా ఉన్న పాలిథిన్ కవర్లలో స్థానికంగా లభించే విత్తనాలు నాటాలని తెలిపారు. పంచాయతీల్లో నిర్మించిన షెగ్రిగేషన్ షెడ్లలో ఎరువులు తయారుచేసి, ఉపయోగంలోకి తీసుకురావాలని సూచించారు. అనంతరం ఎంపీపీ పెందోర్ మోతీరాం మాట్లాడుతూ.. గ్రామాల్లో తాగునీటి సమస్య ఏర్పడకుండా మిషన్ భగీరథ పనులు త్వరగా పూర్తిచేయాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం చేయవద్దన్నారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ సెడ్మాకి ధుర్పతాబాయి, తహసీల్దార్ సమీర్ అహ్మద్ఖాన్, ఎంపీడీవో దత్తారాం, ఎంఈవో సుధాకర్, వైద్యాధికారి సుంకన్న, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ విశ్వేశ్వర్రావ్, ఐసీడీఎస్ సీడీపీవో రెబ్బెక, సూపర్వైజర్ జంగుబాయి ఆయా శాఖల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు.